తాడేపల్లి (ప్రజా అమరావతి);
*నైగర్ లో ఉన్న భారతీయులు త్వరితగతిన భారతదేశం వచ్చేయండి – కేంద్ర విదేశాంగ శాఖ*
*_ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు_*
పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్ (Niger) లో ఇటీవల సైన్యం ఆ దేశ అధ్యక్షుడిపై తిరుగుబాటు చేయడం విదితమే. ప్రస్తుతం విమాన రాకపోకలను ఆపేశారు. ఈ పరిణామాల మధ్య శాంతి భద్రతలపై ఆందోళన నెలకొంది. అక్కడి పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ భారతీయులకు ముఖ్య సూచనలు చేసింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా... అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారతీయులు త్వరగా దేశం వీడాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి గగనతలాన్ని (ఎయిర్ స్పేస్) మూసివేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, భూ మార్గ సరిహద్దుల ద్వారా వచ్చేటప్పుడు భద్రత గురించి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
*నైగర్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్యపై, MEA ప్రతినిధి మాట్లాడుతూ... "ప్రస్తుతం, నైగర్లో సుమారు 250 మంది భారతీయులు నివసిస్తున్నారు, ఇప్పుడు ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా వీరందరూ నియామీలోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలియజేస్తున్నాము. ప్రస్తుతం వీరందరూ సురక్షితంగా ఉన్నారు. వీరు దేశం విడిచి వెళ్లేందుకు మా ఎంబసీ లాజిస్టిక్స్ను సులభతరం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. గగనతలం (ఎయిర్ స్పేస్) మూసివేయబడడంతో, భూ సరిహద్దుల గుండా ప్రయాణించడం కష్టమైనా, మేము మా సాయశక్తులా చేయగలిగినదంతా చేస్తున్నాము" అన్నారు.*
భారతీయ పౌరులు సహాయం కోసం, నియామీ లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన నంబరు +227 9975 9975 ను అత్యవసరంగా సంప్రదించగలరు.
నైగర్కు వెళ్లాలని అనుకునే వారు కూడా అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు రా ష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 8500027678, 0863 2340678 ను సంప్రదించగలరు. అలాగే మీ కుటుంబసభ్యులు ఎవరైనా నైగర్ లో ఉంటే ఈ నంబర్లను సంప్రదించి వివరాలు తెలపగలరని కోరుతున్నాము.
addComments
Post a Comment