తిరుపతి జోనల్ ఆఫీస్ ఏర్పాటుకు చర్యలు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.



*తిరుపతిలో రూ. 16.50 కోట్లతో నిర్మించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ మరియు ల్యాబరేటరీని ప్రారంభించిన మంత్రి*  


*భవనానికి డాక్టర్ వై యస్ ఆర్ పర్యావరణ భవనంగా నామకరణం*


*తిరుపతి జోనల్ ఆఫీస్ ఏర్పాటుకు చర్యలు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి*



తిరుపతి, ఆగష్టు 19 (ప్రజా అమరావతి): తిరుపతిలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయo మరియు ల్యాబరేటరీ భవనంను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. 


శనివారం ఉదయం స్థానిక బాలాజీ కాలనీ నందు నిర్మించిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ భవనమును మరియు ల్యాబరేటరీ ను ప్రారంభించే కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ ఈ భవనానికి 25 సెంట్లు భూమిని రెవెన్యూ శాఖ ద్వారా నగరంలో  కేటాయించబడి, 5 పై అంతస్తులతో   ఏ.పి. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారి పర్యవేక్షణలో మొత్తం రూ. 16.50 కోట్లతో  34 వేల చదరపు అడుగులలో నిర్మించిన ఈ  సొంత భవనాన్ని నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.  భవిష్యత్తు లో జోనల్ కార్యాలయం తిరుపతి లో ఏర్పాటు చేసినా  ఇదే భవనం సరిపోయేలా నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పర్యావరణం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుని మార్పులు తీసుకుని వచ్చారని , మన ప్రభుత్వం వచ్చాక కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణ లో చర్యలు చేపట్టడం జరుగుతోందని , ఎక్కడా కాలుష్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి ద్వారా అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలు  పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నదని, వాటిలో ఆధునిక టెక్నాలజీ అమలుతో కాలుష్యం తక్కువగా ఉండేలా చూడాలని నిర్దేశించామని, ఆ విధంగా పని చేసేలా కాలుష్య నియంత్రణ మండలి రెడ్, ఆరంజ్, గ్రీన్ కేటగిరీ వారీగా చర్యలు చేపడుతోందని అన్నారు.  గత జూన్ నెలలో ఎన్నడూ లేని విధంగా 263.13 మిలియన్ మెగా వాట్ల విద్యుత్ వినియోగం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం అని అన్నారు.  ఈ నూతన భవనంలో ఒక ల్యాబ్ ను ఏర్పాటు చేశామని , పరిశ్రమలు ఎలాంటి వ్యర్ధాలు విడుదల చేస్తున్నాయి అనే వాటిపై ఎప్పటికప్పుడు గమనించి తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఎటువంటి ప్రమాదాలు లేకుండా రెడ్, ఆరెంజ్ క్యాటగిరి పరిశ్రమలు పని చేస్తున్నాయని, నియమాలు అధిగమిస్తే వెంటనే చర్యలు చేపడుతున్నామని అన్నారు. అదే విధంగా ఈ కాలుష్య నియాంత్రణా మండలి ఆక్వా రంగం ద్వారా జరిగే కాలుష్యాన్ని కూడా నివారించే చర్యలు చేపట్టామని, తిరుమల లో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నియంత్రించామని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల భద్రత దృష్ట్యా పని చేస్తున్న కాలుష్య నియంత్రణ మండలి సిబ్బందికి అభినందనలని,  అధికారులు కోరినట్టుగా తిరుపతిలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అన్నారు.


తిరుపతి ఎంపి గురుమూర్తి మాట్లాడుతూ అన్ని రకాల కాలుష్యాన్ని నియంత్రించడమే ధ్యేయంగా ఈ సంస్థ పని చేస్తోందని, పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి జిల్లా ప్రజలు కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, ప్రయోగశాల భవనం ప్రారంభిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సభా ముఖంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.


కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రెటరీ శ్రీధర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి మరియు ల్యాబరేటరీ భవన నిర్మాణానికి అన్ని విధాల సహకరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేడు ఈ కార్యాలయ భవనం ప్రారంభించుకోవడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.


ఈ సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్లు మరకా శివకృష్ణారెడ్డి, పాకా సురేష్, డాక్టర్ సునీల్ కుమార్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కెవి రావు సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రాజశేఖర్, ఆర్.ఓ కడప అశోక్ కుమార్,పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ రోశయ్య, ఈఈ కాలుష్య నియంత్రణ మండలి తిరుపతి నరేంద్రబాబు మదన్మోహన్, సిబ్బంది తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Comments