రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ప్ర‌తిప‌క్షాలు, మీడియా ఆలోచించాలి.

 


గ‌త ప్ర‌భుత్వం కంటే  త‌క్కువ‌గా అప్పులు చేశాం/ కోవిడ్ ప‌రిస్థితుల్లోనూ ఆర్ధిక ఇబ్బందులు అధిగ‌మించాం/ రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిపై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నారు


ప్ర‌భుత్వ క‌ట్ట‌డాల‌కు డిజైన్లు చేసేందుకు ఆర్కిటెక్చ‌ర్ బోర్డు ఏర్పాటు


రూ.200 కోట్ల‌తో స‌బ్ ట్రెజ‌రీ భ‌వ‌నాల నిర్మాణం


విభ‌జ‌న హామీలు ఎన్నో సి.ఎం. శ్రీ జ‌గ‌న్ సార‌థ్యంలో సాధించాం


రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ప్ర‌తిప‌క్షాలు, మీడియా ఆలోచించాలి



రాష్ట్ర ఆర్ధిక‌మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్


జిల్లా కేంద్రంలో ఆర్ధిక కార్యాల‌యాల స‌ముదాయం ప్రారంభించిన ఆర్ధిక మంత్రి


 


విజ‌య‌న‌గ‌రం, ఆగ‌ష్టు 04 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ప్ర‌యోజ‌నాల సాధ‌న‌కు, రాష్ట్రంలో జ‌రిగే మంచి కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌తిప‌క్షాలు, మీడియా స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర ఆర్ధిక‌, ప్ర‌ణాళిక‌, నైపుణ్యాభివృద్ధి శాఖ‌ల మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ కోరారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో సాధించ‌లేని ఎన్నో విభ‌జ‌న హామీల‌ను కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడి ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ నేతృత్వంలో సాధించామ‌ని, దీనిని కూడా ప్ర‌తిప‌క్షాలు స‌హించ‌లేక‌పోతున్నాయ‌న్నారు. రెండేళ్ల పాటు కోవిడ్ క‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ గ‌త ప్ర‌భుత్వ హయాంలో కంటే త‌క్కువ‌గానే అప్పులు చేశామ‌న్నారు. తీసుకున్న‌ అప్పుల  శాతం కూడా గ‌త ప్ర‌భుత్వం కంటే త‌క్కువ‌గా వుంద‌న్నారు. అయితే రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిపై, ప్ర‌భుత్వం తీసుకుంటున్న రుణాల‌పై ప్ర‌తిప‌క్షాలు, ఒక వ‌ర్గం మీడియా అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ప్ర‌తి రాష్ట్రం అప్పులు చేస్తుంటాయ‌ని అది స‌హ‌జ‌మ‌న్నారు. అయితే ప్ర‌భుత్వం తీసుకుంటున్న రుణాల‌ను మీడియాలో ప‌దేప‌దే ప్ర‌చారం చేయ‌డం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిరోజూ రుణాలు తీసుకుంటున్న‌ద‌నే భావ‌న క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మంత్రి చెప్పారు.


 


గ‌త నాలుగేళ్ల‌లో ఎన్న‌డూ లేని రీతిలో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి జాతీయ ర‌హ‌దారుల ప్రాజెక్టులు మంజూర‌య్యాయ‌ని ఇది ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఘ‌న‌త అని చెప్పారు.


 


రాష్ట్ర ఆర్ధిక‌శాఖ నిధులు రూ.14.30 కోట్ల‌తో జిల్లాలోని ఆర్ధిక శాఖ‌కు అనుబంధంగా  వుండే ప‌లు కార్యాల‌యాల‌కు వ‌స‌తి క‌ల్పించే నిమిత్తం క‌లెక్ట‌ర్ కార్యాల‌య స‌మీపంలో నిర్మించిన స‌మ‌గ్ర జిల్లా ఆర్ధిక కార్యాల‌యాల స‌ముదాయాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తో క‌ల‌సి శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆర్దిక మంత్రి బుగ్గ‌న మాట్లాడుతూ కేంద్ర మంత్రులు గ‌ణాంకాల‌తో స‌హా చేసే ప్ర‌క‌ట‌న‌ల‌కు కూడా త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌కుండా రాష్ట్ర స్థాయిలో స్థానిక నాయ‌కులు చెప్పిందే వాస్త‌వం అనే విధంగా ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌న్నారు. వాస్త‌వాల‌నే మీడియా ప్ర‌తిబింబించాల‌న్నారు. రాష్ట్ర  ప్ర‌భుత్వం మౌళిక స‌దుపాయాల‌కు నిధులు స‌మ‌కూరుస్తుంద‌నేందుకు ఈ భ‌వ‌న‌మే ఒక నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు.


 


రాష్ట్రంలో ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు, క‌ట్ట‌డాల‌కు ఒకే విధ‌మైన శాశ్వ‌త‌, ప్రామాణిక‌మైన డిజైన్లు వుండాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వ ఇంజ‌నీరింగ్ విభాగాల‌కు అనుబంధంగా త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ ఏపి స్టేట్ ఆర్కిటెక్చ‌ర్ బోర్డు ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ బోర్డు ద్వారా ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు  అవ‌స‌ర‌మైన, అన్ని వ‌స‌తుల‌తో కూడిన‌ ప్రామాణిక‌మైన డిజైన్లు రూపొందించి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఆర్ధిక సంబంధ కార్యాల‌యాల‌కు మంచి వ‌స‌తుల‌తో కూడిన భ‌వ‌నం స‌మ‌కూర‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తంచేశారు.


 


రాష్ట్రంలో రూ.200 కోట్ల‌తో 50 స‌బ్ ట్రెజ‌రీ భ‌వ‌నాలు నిర్మిస్తున్నామ‌ని మంత్రి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే 30 భ‌వ‌నాలు పూర్త‌య్యాయ‌ని, వీటి కోసం ఇప్ప‌టికే రూ.35 కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు క‌ష్ట‌జీవులని, ఎంతో సౌమ్యంగా, స్నేహ‌పూర్వ‌కంగా వుంటార‌ని పేర్కొన్నారు.


 


రాష్ట్రంలోని పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, ఐటిఐలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ‌ల్లో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌చ్చామ‌ని, వాటి ఫ‌లితాలు రానున్న రోజుల్లో తెలుస్తాయ‌ని చెప్పారు.


 


విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌ర్ కార్యాల‌య భ‌వ‌నం శిథిలావ‌స్థ‌కు చేరిన‌ట్లు మంత్రి బొత్స ప్ర‌స్తావించార‌ని, దీనిని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్లి త‌గిన నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. న‌గ‌రంలోని ప్ర‌భుత్వ పాలిటెక్నిక‌ల్ క‌ళాశాల భ‌వ‌నం శిథిలావ‌స్థ‌కు చేరింద‌ని త‌మ దృష్టికి తీసుకువ‌చ్చార‌ని, దీని ప‌రిస్థితిపై ఒక నివేదిక తెప్పించి త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి కోరిన మేర‌కు పూల్‌బాగ్ రోడ్డుకు త్వ‌ర‌లోనే రూ.3 కోట్లు మంజూరు చేసేవిధంగా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు.


 


రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ జిల్లాలోని ఇత‌ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల కంటే విభిన్నంగా ఆధునిక వ‌స‌తుల‌తో ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ భ‌వ‌నాన్ని నిర్మించార‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా భ‌వ‌నానికి డిజైన్లు రూపొందించి ఉత్తమంగా తీర్చిదిద్దిన ఇంజ‌నీర్ల‌ను మంత్రి అభినందించారు. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌య భ‌వ‌నం 1983 ప్రాంతంలో నిర్మించార‌ని, ప్ర‌స్తుతం శిథిలావ‌స్థ‌కు చేరే ప‌రిస్థితుల్లో వుంద‌ని, కొత్త భ‌వ‌న నిర్మాణం చేప‌ట్టాల‌ని లేదంటే తాత్కాలికంగా మ‌ర‌మ్మ‌త్తుల‌కు నిధులు మంజూరు చేయాల‌ని కోరారు. అదేవిధంగా ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ క‌ళాశాల భ‌వ‌నంపై కూడా ఆలోచ‌న చేయాల‌ని కోరారు. పూల్‌బాగ్ రోడ్డుకు రూ.3 కోట్ల  నిధులు మంజూరు చేయ‌డం ద్వారా న‌గ‌రాన్ని సుంద‌రీక‌ర‌ణ చేసే దిశగా డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు చేయూత‌నివ్వాల‌న్నారు.


 


డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో కీల‌క‌మైన ఆర్ధిక‌శాఖను మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాత్‌ అత్యంత స‌మ‌ర్ధ‌వంతంగా గ‌త నాలుగేళ్లుగా నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొన్నారు. న‌గ‌రాన్ని గ‌త నాలుగేళ్లలో సుంద‌రీక‌ర‌ణ చేసేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని, వాటి వ‌ల్ల స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌న్నారు. న‌గ‌రం ప‌చ్చ‌ద‌నంతో వుంద‌ని మంత్రి ప్ర‌శంసించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తంచేశారు.


 


ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ధిక‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షంషేర్‌సింగ్ రావ‌త్‌, ఖ‌జానా శాఖ సంచాల‌కులు ఎస్‌.మోహ‌న‌రావు, జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఎస్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, శాస‌న‌స‌భ్యులు బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, కంబాల జోగులు, జిల్లా ఖ‌జానా అధికారి కె.ఏ.ఎన్‌.కుమార్‌, ముఖ్య ప్ర‌ణాళిక అధికారి పి.బాలాజీ, జిల్లా ఆడిట్ అధికారి అరుణ‌కుమారి, పే అండ్ అకౌంట్స్ అధికారి ఎం.రామసుబ్బయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.


 



Comments