మచిలీపట్నం జులై 5 (ప్రజా అమరావతి):---
ఈనెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నా భూమి నా దేశం కార్యక్రమాన్ని. ఘనంగా నిర్వహించాలని
జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్ లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టవలసిన "నా భూమి-నా దేశం, నేల తల్లికి నమస్కారం- వీరులకు వందనం "అనే ప్రత్యేక కార్యక్రమం పై సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లులతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, పట్టణ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా దేశ సంక్షేమం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్థానిక మహనీయులను, సాహసవంతులు, వీరులను స్మరించుకోవాల్సి ఉందన్నారు. పుట్టుకతో ఈ నెల పై బంధం పెంచుకున్న మనము దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాల్సి ఉందన్నారు.
ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన అన్ని గ్రామాలు పట్టణాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సందేశంతో పాటు దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, త్యాగధనులు, వీరులను గుర్తు చేసుకుంటూ అమృత సరోవర్లు నీటి వనరుల వద్ద జ్ఞాపక శిలాఫలకాలను ఏర్పాటు చేసుకొని సెల్ఫీలను దిగి నిర్ణీత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రధానంగా జిల్లాలోని ఎంపిక చేసిన 97 అమృత్ సరోవర్లు, 195 పాఠశాలలు, 143 గ్రామపంచాయతీ కార్యాలయాలు, 62 సచివాలయాలు మొత్తం కలిపి 497 ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతీ కార్యక్రమంలో ప్రజలందరూ మట్టిని గాని మట్టి దీపాన్ని గాని చేతిలో ఉంచుకొని పంచ ప్రాణ ప్రతిజ్ఞ చేయాలన్నారు. శిలాఫలకాల చుట్టూ మట్టి దీపాలను వెలిగించాలన్నారు.
ఈనెల 10వ తేదీన పంచప్రాణ ప్రతిజ్ఞ రెండవ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయాలన్నారు.
ఈనెల 11వ తేదీన వసుధకు వందనం పేరుతో 75 మొక్కలను నాటి ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు
ఈనెల 14వ తేదీన వీరులకు వందనం చేపట్టి మరణించిన వీరుల కుటుంబాలను, జీవించి ఉన్న వీరులను సత్కరించి ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు.
ఈనెల 15వ తేదీన
జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేయాలన్నారు.
అనంతరం ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు మండలాలు పెద్ద మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పలు కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
గ్రామపంచాయతీలు మండలాలకు చెందిన యువత వారి ప్రాంతాల్లోని మట్టిని కళాశాలలో తీసుకుని ఢిల్లీకి ప్రయాణమై
ఈనెల 27 28 తేదీలలో ఢిల్లీకి చేరుకుని అక్కడ కర్తవ్యపద్ లో జరిగే ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.
ఇందుకోసం ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా సమన్వయకర్త ఎస్ రాము, జడ్పీ సీఈవో జ్యోతిబసు, డ్వామా డి ఆర్ డి ఎ పి డి లు సూర్యనారాయణ, పిఎస్ఆర్ ప్రసాద్, డిపిఓ నాగేశ్వర నాయక్, డి ఈ ఓ తెహరా సుల్తానా, డిటిడబ్ల్యూ ధూర్జటి పని, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కళ్యాణి వీణ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రావణి తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment