జగన్ అసమర్ధ పాలనతో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి.



*జగన్ అసమర్ధ పాలనతో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి


*


*తిరువూరు లో చెపుతున్న… మూడు నెలల తరువాత అమరావతే రాజధాని*


*టీడీపీ పరిశ్రమలు తెస్తే.. జగన్ గంజాయి తెచ్చాడు*


*దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారు*


*రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అంతా సిద్ధమవ్వాలి*


*త్వరలో టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో*


*వైసీపీ త్వరలో క్లీన్ బౌల్డ్…అందుకే నేతలు పార్టీ వీడుతున్నారు*


*తిరువూరు “రా.. కదలిరా” బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు*


తిరువూరు.  (ప్రజా అమరావతి )-: అమ్మలను గన్న అమ్మ దుర్గమ్మ, గుణదల మేరీ మాత కొలువైన ప్రాంతం కృష్ణా జిల్లా.  యుగపురుషుడు, తెలుగు ఆత్మగౌరవం అన్న ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పుట్టిన నేల కృష్ణా జిల్లా, కొండపల్లి బొమ్మలు, కూచిపూడికి నిలయం ఈ కృష్ణా జిల్లా. తెలుగు జిల్లాల్లో వారసత్వానికి నాంది పలికి ప్రాంతం కృష్ణా జిల్లా. ప్రపంచంలో ఏ మూలకు వెళినా కృష్ణా జిల్లా ప్రాంతం వాళ్లే అధికంగా ఉంటారు. 

5 కోట్ల ప్రజల కోసమే రా.. కదలిరా

ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష. ప్రపంచంలోనే రాజకీయాలను శాసించే సమయం మన వాళ్లకు వస్తుంది. గ్లోబల్ లీడర్ లా తెలుగు వాళ్లు మారడానికి నిచ్చెన్నలా టీడీపీ ఉంది. 25 ఏళ్లకు ముందు నేను తెచ్చిన ఐటీ పిల్లలకు ఆయుధంలా మారింది. ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు 80 దేశాల్లో నిరసన తెలియజేశారు. సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు నాంది పలకబట్టే నేడు హైదరాబాద్ వెలిగిపోతుంది. మరో వైపు అమరావతి వెలవెల పోవడానికి కారణం జగన్ రివర్స్ పాలన. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా.. కదలిరా.. కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది మా కోసం కాదు 5 కోట్ల ప్రజల కోసం పిలుపునిస్తున్నాం.

అరాచక పాలనకు చరమగీతం పాడాలి 

ఒక తరం, ఒక రాష్ట్రం, 5 ఏళ్లల్లోనే  5 కోట్ల మంది ప్రజలు నష్టపోయిన ప్రాంతం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక అసమర్ధుడు అధికారానికి వస్తే కొంత వరకు నష్టపోతాం. కాని ఒక దుర్మర్గుడు వస్తే తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డాం. ఈ రాష్ట్రంలో అందరూ జగన్ బాధితులే. ఆఖరికి నా తో సహా అందరూ బాధితులే. పోలీస్ స్టేషన్ పోని నాయకులు ఎవ్వరూ లేరు. ప్రజాస్వామ్యంలో నిద్రలు లేని భయంకర కాల రాత్రులు గడిపాం. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడాలి. 

టమోటోకి పొటాటోకి తేడా తెలియని సీయం

వ్యవసాయ శాఖనే మూసేశారు. హార్టీకల్చర్ రైతు మూలన పడ్డాడు. ధాన్యం రైతు దగా పడ్డాడు. ఆంధ్ర ప్రదేశ్ రైతు అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానం. కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం. రైతులు ఆత్మహత్యల్లో మూడో స్థానం. ధాన్యం కొనేవాడు ఎవరైనా ఉన్నారా? మద్ధతుధర ఇవ్వడం లేదు. టమోటోకి, పొటాటోకి తేడా తెలియని ముఖ్యమంత్రికి వ్యవసాయం తెలుసా?  సీఎం చేతగానితనం వలనే వరదలకు పంటలను కొట్టుకుపోయాయి.

జగన్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లు

డయాఫ్రం వాల్ ఎక్కడ ఉందో కూడా ఆంబోతు మంత్రికి తెలియదు. కాఫర్ డ్యాం మధ్యలో నీళ్లు వదిలిపెడుతున్నారు. గైడ్ బండ్ కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక దుర్మార్గుడు డబ్బులకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్ ను మార్చి టీడీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యే ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లందిచే వాళ్లు. ప్రాజెక్టుల్లో కాదు కనీసం కాలువల్లో పూడిక కూడా తియ్యలేకపోతున్నారు. కాంట్రాక్టర్ పని చేయకపోతే ప్రభుత్వం దానిని బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. కాని నేడు కాంట్రాక్టర్లే ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు. నేడు కాంట్రాక్టార్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

చింతపూడి ఎత్తిపోతలను పూర్తి చేసే బాధ్యత మాది

చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేస్తే 36 మండలాలకు నీళ్లు వచ్చేవి. రూ.4,900 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే కృష్ణా జిల్లాల్లో నందిగామ,  మైలవరం, నూజివీడు, జగ్గయ్యపేటలకు నీళ్లు తీసుకుపోవచ్చు. రూ.3,400 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రూ.410 కోట్లతో ముక్య్తాల వద్ద ఎత్తిపోతలు పెడితే వేదాద్రి గారి పేరు మార్చారు గాని ప్రాజెక్టు మీద ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు ఈ చేతగాని  ముఖ్యమంత్రి. పిట్టలువారి గూడెంలో రూ.690 కోట్లతో 50వేల ఎకరాలకు నీళ్లు వచ్చే ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సాగు నీరు రావాలన్నా, రైతు జీవితం బాగు కావాలన్నా టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలి. ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి. మళ్లీ రైతు రాజుగా తయారు కావాలి. రైతు రాజ్యం వస్తుంది.

మన రాజధాని అమరావతి

అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి ఫౌండేషన్ వేశారు. ఎన్నికలకు ముందుకు రాజధాని ఇక్కడే ఉంటుదని జగన్ చెప్పారు. కాని ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారు. రాజధానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ముంపుకు గురి అవుతుంది అంటూ తప్పుడు ప్రచారం చేశారు. రాజధాని వస్తే మరో సైబరాబాద్ అయ్యి ఉండేది. ప్రభుత్వానికి రాజధాని ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 5 ఏళ్లు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కులు చేసి వైజాగ్ వెళ్లిపోతానంటే ఎక్కడికి వెళ్లడానికి వీళ్లేద్దని కోర్టు ముట్టికాయలు వేశారు. రూ.500 కోట్ల ప్రజాధనంతో రుషికొండను బోడిగుండు కొట్టారు. మళ్లీ రాజధాని అమరావతి గానే ఉంటుంది. మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు త్వరలోనే ఉంటుంది. 


మేము పెట్టుబడులు తెస్తే జగన్ మాఫియాను తెచ్చారు

జగన్ చేతుల్లో మోసపోయిన వాళ్లల్లో యువతే ఎక్కువగా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డీఎస్సీ పెట్టారా? పెట్టుబడులు వచ్చాయా? 15 సంవత్సరాలు పైబడిన వాళ్లు నిరుద్యోగులుగా 24 శాతంతో మన రాష్ట్రమే అత్యధికంగా ఉంది. ఉద్యోగాలు రావాలని పరిశ్రమలు రావాలి. పెట్టుబడులకు బదులు జగన్మోహన్ రెద్డి మాఫియా తెస్తున్నారు. మేము దగ్గరుండి మరీ హెచ్.సీ.ఎల్ ను తీసుకువచ్చాం. హైదరాబాద్ లో అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. అదే విధంగా ఏపీలోను తీసుకువచ్చాం. మనం ఉద్యోగాలు తెస్తే జగన్ గంజాయి తెచ్చారు. సైకిల్ ఎక్కి తెలుగుదేశం, జనసేన జెండాలు పట్టుకొని ఊరూరాలో భరోసాను కల్పించండి. రోజుకు నాలుగు నుండి ఐదు గంటలు పని చేస్తే మన ప్రభుత్వం వస్తే మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం. 

ప్రజలకు రూ.10 ఇచ్చి జగన్ రూ.100 కొట్టేస్తున్నారు

దొంగ ఓట్లు, రౌడీయిజం, డబ్బు ఖర్చు పెట్టి మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్ భావిస్తున్నారు. అయితే నీ ఆటలు సాగవు జగన్ రెడ్డి. 5 ఏళ్లుగా సామన్యులపై బాధుడే బాధుడు. సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్. జగన్ వచ్చాక అన్న క్యాంటీన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక, చంద్రన్న బీమా కట్ చేశారు.  మూడు నెలల్లో వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిశ్చయించుకున్నాయి. విద్యుత్ చార్జీలు మేము పెంచలేదు. కాని జగన్ 9 సార్లు పెంచారు. మద్యం ధరలు భూంభూం అంటూ నాణ్యత లేని బ్రాండ్లు తెచ్చారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఇక్కడికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి ఆడపడుచులు తాళిబొట్లు తెంచుతున్నారు. మద్యపాన నిషేదం చేస్తేనే మళ్లీ ఓట్లు అడుగుతానని జగన్ హామీ ఇచ్చాడా లేదా? కాని నేడు అదే మద్యాన్ని అడ్డం పెట్టుకొని రూ.25వేల కోట్లు తెచ్చారు. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు.

రంగుల పిచ్చోడో జగన్. 

ప్రతి దానిలో ఈయన ఫోటో వేసుకోవాలి. ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటున్నారు. మనం టిడ్కో ఇళ్లు కడితే దానికి జగన్ రంగులు వేసుకుంటున్నారు. సర్వే రాళ్లపైన జగన్ రంగు కొట్టారు. పట్టాదారు పుస్తకం పైన జగన్ ఫోటో పెట్టుకోవడం సిగ్గుచేటు. ఓటు ఆయుధంతో జగన్ కు తగిన బుద్ధి చెప్పాలి. ఆడపడుచుల గౌరవం కోసం టీడీపీ 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం. రాబోయే కాలంలో జగన్ అక్కడ కూడా ఫోటో వేస్తారేమో?

సూపర్ సిక్స్

బాబూ ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీతో సూపర్ సిక్స్ ను తీసుకువస్తున్నాం. డ్వాక్రా సంఘాలను టీడీపీ పెట్టింది. మహిళలకు అనేక పథకాలకు అమలు చేశాం. మహాలక్ష్మీ ద్వారా నెలకు రూ.1500 ఎంత మంది మహిళలు ఉంటే అందరికి ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం కింద పిల్లలందరికి రూ.15వేలు చొప్పున ఇస్తాం. ఏడాదికి 3 సిలెండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడికి పోవాలని ఉచిత రవాణా కల్పిస్తాం. 5 ఏళ్లల్లో  ప్రభుత్వంలోగాని ప్రైవేట్ లో గాని 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. అదే విధంగా మీరు ఎక్కడ ఉంటే అక్కడే పని చేసే విధంగా వర్క్ ఫ్రం హోం తెస్తాం. అందుకోసం అందమైన గార్డెన్లు పెడతాం. మీకు ఉద్యగం వరకు రూ.3వేలు ఇస్తాం. అన్నదాత కింద రైతులకు రూ.20వేలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు. జయహోబీసీ ద్వారా సబ్ ప్లాన్ పెడతాం. 129 వర్గాలను బాగు చేసే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఒక దళిత బిడ్డను చంపిన ఎమ్మెల్సీని ఊరుగింపుతో తీసుకువెళ్లారు.  దళితులన్ని అన్ని విధాలుగా హింసలు పెట్టారు. 30 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూశారు. ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందిస్తాం.

ఎమ్మెల్యేలు, మంత్రులకు ట్రాన్సఫర్లు ఉంటాయా?

ప్రజలే జగన్ ను నమ్మటం లేదు. కాని జగన్ మాత్రం ఎమ్మెల్యేలను నమ్మడం లేదు.  ఏపీ మొత్తం హేట్స్ జగన్. సైకో పోవాలని ప్రజలందరూ నినదీస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైసీపీ నాయకులు ఇంట్లో నుంచి భయటకు కూడా రాలేరు. ఊళ్లకు ఊళ్లు ఏకం కావాలి. ఈ ఊర్లో చెత్తను వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ట్రాన్సఫర్లు ఉన్నాయా? ఈ నియోజకవర్గంలో చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో చెల్లుతుందా? మీ ఇంట్లో చెత్త పక్క ఇంట్లో వేస్తే బంగారు అవుతుందా? రాష్ట్రాన్ని జగన్ 5 ఏళ్లల్లో లూటీ చేశారు, వ్యవస్థలను నాశనం చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలను మరిస్తే గెలుస్తారా? 

అక్కడ వేస్టులు ఇక్కడ బెస్టులు ఎలా అవుతారు? 

మన పిల్లల భవిష్యత్ నాశనం అవ్వడానికి జగన్ కారణం. అంబటి రాయుడుకు గుంటూరు పార్లమెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు, తరువాత మరొకరికి ఇస్తానన్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని తెలిసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రజలకు సేవ చేసే వాడికి సీటు కాదంటా?  ఎవడు  నన్ను, పవన్ , లోకేష్ ని తిడితే వాళ్లకే సీటు అంటా? విజయవాడ వెస్ట్ లో కొబ్బరి చిప్పల మంత్రి ఎండోమెంట్ మొత్తాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ఆయన వెస్ట్ లో వేస్ట్ అయ్యి ఇక్కడ బెస్ట్ అవుతాడా? సెంట్రల్ ఎమ్మెల్యే బ్రాహ్మలను ఏం చేయలేదు ఇప్పుడు ఆయన వెళ్లిపోయాడు. నందిగామ జగన్ మోహన్ దొంగ ఉన్నాడు ఎవరైనా నో అంటే మొండితోక మొండికేస్తాడు. మైలవరంలో ఎమ్మెల్యే అవినీతిపరుడు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే కొడుకే డ్రగ్స్ రవాణాలో పట్టుబడ్డారు. తిరువూరులో భక్షణ నిధితో మోతమోగిస్తున్నారు. వీళ్లు ప్రజా ప్రతినిధులా? వీళ్లను ఇలా జగన్మోహన్ రెడ్డే తయారు చేశారు. ఈయన తప్పులు చేయించి, వాటాలు పంచుకొని గెలవమని తెలిసి చిన్నగా జారుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి దుర్మార్గుడు అధికారంలో ఉండటానికి వీళ్లు లేదు. పింఛన్ ప్రారంభించి ఎన్టీఆర్ అయితే దానిని పెంచింది నేను. రూ.200 పెన్షన్ రూ.2000కు పెంచింది నేనే. అదే టీడీపీ గెలిచి ఉండి ఉంటే మొదటి నెల నుంచి రూ.3000 వచ్చి ఉండేది? టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురండి.

Comments