వైసీపీ పాలనలో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు.


*శిశుపాలుడు 100 తప్పులు చేస్తే జగన్ 1000 తప్పులు చేశాడు*

*జగన్ విశ్వసనీయత పెద్ద ఫార్స్*

*హోదా తెచ్చాడా, సిపిఎస్ రద్దు చేశాడా, మద్యపానిషేదం చేశాడా*

*ఎర్రచందనం స్మగ్లర్ లకు అసెంబ్లీ టిక్కెట్లా? ప్రజలు ఆలోచించాలి*

*వైసీపీ పాలనలో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు


*

*దొంగ ఓట్ల అక్రమాలకు మూల్యం చెల్లించక తప్పదు*

వెంకటగిరి ‘రా. కదలిరా’’ బహిరంగ సభలో  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు .


వెంకటగిరి (ప్రజా అమరావతి);

రా. కదలిరా కార్యక్రమానికి వెంకటగిరి గర్జించింది. రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోంది. రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో పెట్టిన తుగ్లక్ పని అయిపోయింది. వెంకటగిరి ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది. జిల్లా మారింది కాని వెంకటగిరి రాత మారిందా? ఒక్క అభివృద్ధి జరిగిందా? ఎవరైనా ఆనందంగా ఉన్నారా? విధ్వంసకర పాలనను తరమివేయడానికి రా. కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

వెయ్యికి పైగా తప్పులు దాటిన తుగ్లక్

మీ పాలన బాగోలేదని చెప్పిన వ్యక్తి ఆనం రాంనారాయణ రెడ్డి. అందుకు ఆయన మీద ఏ విధంగా ప్రవర్తించారో అందరం చూశాం. ఆయన ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి హాయంలో మంత్రిగా చేసిన వ్యక్తి మాటే జగన్ రెడ్డి వినలేదు. ఆయన అడిగింది మంత్రి పదవి కాదు ప్రజాహితం కోసం కోరితే దూరం పెట్టారు. అలాంటి సీనియర్ నాయకులను లెక్కచేయని అహంబావి జగన్ రెడ్డి. రామకృష్ణ నియోజకవర్గం ఇంచార్జ్ గా 5 ఏళ్లు పోరాడారు. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించారు. ఈ తుగ్లక్ ఇప్పటికే 1000 తప్పులు చేశాడు ఇంక బరించలేము. మనకు ఇంకా 82 రోజులే సమయం ఉంది. జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలయ్యింది.

ఏ ఒక్క వర్గం బాగుపడలేదు

రాష్ట్రంలో ఏ రైతు, యువత, మహిళైనా ఆనందంగా ఉన్నారా? పేదలు తిండే తినే పరిస్థితి లేదు. ఆఖరికి పండుగ కానుకలను రద్దు చేశారు. అన్న క్యాంటీన్లు నిలిపివేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పని అయిపోయింది. జీతాలు పెంచమని అడగడం కంటే 1వ తారీఖు జీతాలు వెయ్యమని అడిగే పరిస్థితి. అడిగితే జైలుకు పోతామని అడగకుండా రాజీ కొచ్చారు. చిరు వ్యాపాస్థుల పరిస్థితి బాగోలేదు. వెంకటగిరి అంటే గుర్తుకు వచ్చేది చేనత రంగం. వెంకటగిరి చీరలు ప్రత్యేకం. ఒక్క చేనేత కార్మికుడైనా బాగుపడ్డారా? టీడీపీ హయాంలో 50 ఏళ్లకే పింఛన్లు ఇచ్చాం. కష్టం వస్తే ఆదుకున్నాం. 2015లో వరదలు వస్తే రూ.15వేలు కుటుంబానికి ఇచ్చాం. జగన్ పాలనలో ఏ కులమైనా బాగున్నారా? ఆఖరికి రెడ్డి కులస్థులు అథోగతి పాలవుతున్నారు. 

జగన్ పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి 

చెన్నైతో తిరుపతి, నెల్లూరుని లింక్ చేసి హబ్ గా చేయాలనుకున్నాం. వీటిని కనెక్ట్ చేస్తూ రోడ్లని వేశాం. తిరుపతిని ఎలక్ట్రానికి హబ్ గా చేశాం. సెల్ కాల్, కార్బన్, డెక్కన్ వంటి అనేక కంపెనీలు తిరుపతికి తెచ్చాం. అక్కడ కంపెనీల్లో పని చేయించుకునేందుకు వెంకటగిరి నుంచి యువతను బస్సులో తీసుకువెళ్లుతున్నారు. హీరో మోటార్స్, అపోలో టైర్లు, రిపబ్లిక్ ఫోర్స్ తో శ్రీ సిటీలో పెట్టి యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలోనే మంచి సంస్థలను తీసుకువచ్చాం. కాని నేడు అన్నీ పోయాయి. 

టీడీఆర్ బాండ్ల అవినీతిని వెలికితీస్తాం

తిరుమల భక్తుల కోసం రూ.630 కోట్లతో గరుడ వారధి తీసుకువస్తే జగన్ గంజాయి తెచ్చారు. మనం ఒక టెంపుల్ సిటీగా ప్రమోట్ చేస్తే జగన్ దొంగ ఓట్ల సంస్కృతి తెచ్చారు. ఎర్రచందనాన్ని ఉక్కుపాదంతో అణచివేశాం. నేడు సాక్షాత్తు స్మగ్లర్ కే చిత్తూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. ప్రజలకు ఎవరికైనా రక్షణ ఉందా? నాడు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే జగన్ 24 శాతం నిరుద్యోగం పెంచారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మనం దక్షిణ కొరియా ప్రభుత్వంతో మాట్లాడి  కియా లాంటి కారు పరిశ్రమను తీసుకువస్తే జగన్ మాత్రం అమర్ రాజాను తరిమేశారు. జాబు కావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే మీరు పని చేయాలి. టీడీపీ బాండ్స్ లో రూ.25వేల కోట్ల  అక్రమాలు జరిగాయి. టీడీపీ అధికారంలోకి వస్తే ఎంక్వైరీ వేసి తప్పు చేసిన వాళ్లందరిని శిక్షిస్తాం.

రెడ్ శాండిల్ స్మగ్లర్లకు రెడ్ కార్పెట్టా?

ఎర్రచందనం వైసీపీ నాయకులకు ఆర్ధిక వనరుగా మారింది. ఈ 5 ఏళ్లల్లో ఒక్క ఎర్రచందనం పట్టుకున్నారా? ఎర్రచందనం స్మగ్లర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ప్రజాసందను దోచేస్తున్నారు. రూ.7,500 కోట్లు దోపిడీ చేశారు. వెంకటేశ్వరస్వామి టెంపుల్ ను అపవిత్రం చేస్తున్నారు. ఆయనకు అపచారం చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని వదలిపెట్టరు. కొండపై అన్నదానం బాగుందా? ఎన్టీఆర్ అన్నదానాన్ని ప్రారంభించారు. కార్పస్ ఫండ్ కూడా నాడు వచ్చింది. 

దోచుకొని దాచుకోవడమే జగన్ నైజం 

ఎర్రచందనంతో పాటు ఇసుకను దండుకుంటున్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. మనం ఉచిత ఇసుకను ఇస్తే నేడు దానిని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. మంగంపేట బెరైటీస్, గ్రానైట్, లెటరైట్, లైమ్ స్టోన్, బీచ్ శాండ్ అన్నింటిలో దోపిడీకి పాల్పడుతున్నారు. మీ పొలంలో ఉండే మట్టిని కూడా చెన్నైకి తీసుకుపోతున్నారు. జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు గెలవాలి జగన్ పోవాలి. 

దొంగ ఓట్లకు పాల్పడిన అధికారులకు శిక్షలు తప్పవు

ఏ పాలకుడైనా అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతారు. కాని ఈ దుర్మార్గుడు మాత్రం ఓట్ల విధ్వంసం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో లక్షా 15వేల దొంగ ఓట్లు చేర్చారు. దానిని జగన్ వత్తాసు పలుకుతున్నారు. దొంగ ఓట్లకు పాల్పడుతున్న అధికారులకు శిక్షలు పడుతున్నారు. కోర్టులో కేసును వెనక్కి తీసుకోమని ఇప్పుడు పనబాక లక్ష్మీ ఇంటికి అధికారులు క్యూలు కడుతున్నారు. కేసు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. మిమ్మల్ని బోన్ ఎక్కించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. దొంగ ఓట్లతో మనుషులు బ్రతికి ఉండగానే చంపేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గులకు శిక్షలు తప్పవు. 

కాంట్రాక్టర్లు  ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు

పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. జగన్ పాలనలో నష్టపోయిన వ్యక్తి లేడు. రూ.95వేల కోట్ల బకాయిలు, 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆఖరికి బిల్లు రాక వైసీపీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేవారు. ఇప్పుడు రివర్స్ లో కాంట్రాక్లరే ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు. టెండర్ పిలిస్తే ఎవ్వరూ రావడం లేదు. 

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని రివర్స్ లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏది? మూడు ముక్కలాడారు. మాట తప్పను, మడమ తిప్పను అనేది జగన్ ఊతపదం. 98 శాతం హామీలు నెరవేర్చాం అన్నారు. కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నాడు, 5 ఏళ్లు అయ్యింది కేంద్రం మెడలు వంచాడా? కాదు మెడలు దించాడు. మద్య పాన నిషేదం చేస్తేనే ఓట్లు అడగుతానన్నారు. నేడు సొంత బ్రాండ్లు, నాశిరకం బ్రాండ్లు పెట్టి మన జీవితంతో ఆడుకుంటున్నారు.  25 ఏళ్లకు  మద్యాన్ని తాకట్టు పెట్టారు. ఓటు అడిగే హక్కు ఉందా? సీపీఎస్ రద్దు వారంలో చేస్తామన్నారు. ఇప్పటికి ఎన్ని వారాలయ్యాయి. సీపీఎస్ రద్దు చేశారా? కరెంట్ చార్జీలు లేకుండా చేస్తానన్నారు. కాని నేడు రూ.200 బిల్లు కట్టే వారికి రూ.1000 వస్తుంది. 9 సార్లు పెంచారు. వివేకానందరెడ్డి గుండె పోటుగా చిత్రీకరించారు. తరువాత పోస్ట్ మార్టు వచ్చాక గొడ్డలిపోటుగా మార్చారు. నారా సుర రక్త చరిత్ర అంటూ కథలు వండివార్చారు. చివరికి చేసిందెవరో తెలిసినా వారిని కాపాడారు.

ఒక్క ఛాన్స్ మాట నమ్మి మోసపోయాం : 

జగనన్న బాణం రివర్స్ అయింది. కారణమేంటి? ఇదేనా విశ్వసనీయత? జగన్ రెడ్డి విశ్వసనీయత ఎలాంటిదంటే.. 29 మంది దళిత ఎమ్మెల్యేలను మార్చాడు. మోసం చేసి ఓట్లు వేయించుకుని మరోసారి రాజకీయ కుట్రకు తెరలేపాడు. మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నాడు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినా.. దాని వెనుకటి గుణములు మరచిపోదు. ఫ్యాక్షనిస్టు, నేరస్తుడు, మానసిక రోగి అని తెలిసినా.. నెత్తిన చెయ్యి పెట్టి ఒక్క ఛాన్స్ అనగానే ఐస్ అయిపోయి ఓట్లేశాం. చివరవకి అందరం నష్టపోయాం.

దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్లు వైసీపీ ఎమ్మెల్యేలు :

వెంకటగిరికి వచ్చిన కొత్త బిచ్చగాడు.. పెన్నా నదిలో ఇసుక వదలడు. తెల్ల రాయి వదలడు. మొలకలకొండలో కొండలు తవ్వేశాడు. భూములు కబ్జాలు చేస్తున్నాడు.  ఇసుక, మద్యం, గంజాయి, క్రిటెట్ బెట్టింగుల్లో కలివేటి సిద్ధహస్తుడు. జగన్ రెడ్డి స్పూర్తితో స్థానిక ఎమ్మెల్యే అంతకు మించి అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. గూడూరులో ఎమ్మెల్యే వర ప్రసాద్ ఇసుక, సిలికా దోపిడీ తేల్చాలంటే పుస్తకాలు సరిపోవు. క్లబ్బు డాన్సర్లు కూడా మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. కోర్టుల్లోని సాక్ష్యాలు కూడా కొట్టేసే కాకాణి ఒక మంత్రి. మద్యం, గ్రావెల్ దోపిడీతో జిల్లాను సైతం కొనేసే స్థాయిలో వెనకేసుకున్నాడు. మైనింగ్ పుడింగి దోపిడీకి రాష్ట్రంలోని మైన్స్ అన్నీ బెంబేలెత్తుతున్నాయి. రేణిగుంటను కూతురికి, ఏర్పేడు తమ్ముడికి, కాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఆక్రమించుకున్నారు. ఏడు కొండల వాడిని సైతం దోచుకునే వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. ఇంతటి దుర్మార్గులొస్తారని ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రశాంతమైన చిత్తూరులో ఇలాంటి దుర్మార్గులు అధికారంలోకి రాకూడదు. కందలేరు జలాశయం పనులు పూర్తి చేయలేదు. తెలుగు గంగ గాలికొదిలేశారు. సోమశిల హైలెవల్ కెనాల్, తోపుగుంట పనులు ఎందుకు పూర్తి కాలేదు? గూడూరులో ఫ్లై ఓవర్ నిర్మాణాలు ఎందుకు చేయలేదు? ఆక్వా రంగాన్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటా. స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి పనులు పూర్తి చేస్తా.

పేదరిక నిర్మూలనే నా లక్ష్యం :

ప్రతి కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. కుటుంబ వికాసం కోసం ప్రపంచంలోని తెలుగువారంతా ఏకం కావాలి. పేదరికం లేని సమాజ నిర్మాణానికి శ్రీకారం చుడదాం. నా ఆలోచన స్వర్ణయుగం.. జగన్ రెడ్డి ఆలోచన రాతియుగం. ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. తిరుపతి పార్లమెంటులో ఏడు సీట్లు గెలుస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఇంట్లో చర్చ జరగాలి.

Comments