జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి.



*జిల్లాలో  తాగునీటి సమస్య  లేకుండా చర్యలు తీసుకోవాలి*



*రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


కర్నూలు,  ఫిబ్రవరి 21 (ప్రజా అమరావతి): జిల్లాలో  తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  అధికారులను ఆదేశించారు. 


బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా-పారిశుద్ధ్యం, జిల్లా గ్రామీణాభివృద్ధి  అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, నంద్యాల జిల్లా కలెక్టర్ డా కె.శ్రీనివాసులు, నందికొట్కూరు శాసనసభ్యులు తోగూరు ఆర్థర్,  డిసిఎంఎస్ చైర్మన్ శిరోమణి, కర్నూలు, నంద్యాల జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటైన 5 సంవత్సరాలలో ఎన్నో  సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు... మొదటి సంవత్సరంలో  రాష్ట్ర పునర్వ్యస్థీకరణకు  సంబంధించిన సమస్యలు, అలాగే  రాజధాని, పారిశ్రామిక వాడలు, పోలవరం ప్రాజెక్ట్ పనులు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి వివిధ ప్రాజెక్టులు అన్నీ  సగంలో వదిలివేయడం వాటిని 

సరిదిద్దే లోపు  కరోనా  లాంటి విపత్కర పరిస్థితులు  రావడం జరిగిందన్నారు..ఈ విధంగా ప్రతికూల పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం  5 ఏళ్ల పరిపాలన చేయాల్సి  వచ్చిందన్నారు.  గత ప్రభుత్వాలు ఏవి కూడా వారి పరిపాలన సమయంలో  ఇటువంటి సమస్యలు ఎదురుకోలేదన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం మానిఫెస్టో ను ఒక గ్రంథంగా  భావించి  ముఖ్యమంత్రి  ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని,  దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మానిఫెస్టో లో చెప్పినట్లుగా 99 శాతం హామీలు అమలు చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదేనన్నారు. ఈ విధంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేయడం ద్వారా ఒక బెంచ్ మార్క్ సెట్ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు..ఈ క్రమంలో స్థానిక సంస్థల కు సంబంధించి అనుకున్నంత చేయలేకపోయామని, అయినప్పటికీ గతంలో కంటే మెరుగ్గా జిల్లా పరిషత్ కు  ఏడాదికి 10 కోట్లకుపైగా నిధులు మంజూరు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల కు పైగా నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు.. వీటికి తోడు సీనరేజ్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.


తాగునీటి అంశంపై సమీక్ష లో భాగంగా  మంత్రి మాట్లాడుతూ వర్షాలు తక్కువగా పడినందున  ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, సమస్యలు రాకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.   ముఖ్యంగా పాఠశాలల్లో, వసతి గృహాల్లో నీటి సమస్య రాకుండా వెంటనే  ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు..సభ్యులు లేవనెత్తిన తాగునీటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.. మిడుతూరు, ఓర్వకల్, గూడూరు, వెల్దుర్తి, ఆలూరు, హోళగుంద, చిప్పగిరి, జూపాడుబంగ్లా లోని జడ్పిటిసి, ఎంపీపిలు తాగునీటి సమస్య ను  ప్రస్తావించిన నేపథ్యంలో గ్రామాల్లో బోర్లను అద్దెకు తీసుకోవడం, ఉన్న బోర్లను ఫ్లషింగ్, డీపెనింగ్ చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించాలని మంత్రి RWS అధికారులను ఆదేశించారు..వాటికి సాధ్యం కాకపోతే  ట్రాన్స్పోర్టేషన్ అమలు చేయాలని ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ  కి సూచించారు..ఫ్లషింగ్, డీపెనింగ్ పనుల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని, పనులు జరిగిన తర్వాత రాండం గా చెక్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు..


పెన్షన్లకు సంబంధించి కొంతమందికి మంజూరు కాలేదని జడ్పిటిసిలు మంత్రి దృష్టికి తీసుకురాగా,కొత్త పెన్షన్లు ప్రతి ఏడాది జూన్ నెల లోపు,  డిసెంబర్ నెల లోపు మంజూరు అవుతాయని,అలా డిసెంబర్ నెలలోపు దరఖాస్తు చేసుకొని, అర్హత ఉండీ రాకపోయినట్లయితే, వారి వివరాలు ఇవ్వాలని, వాటిని పరిశీలించి మంజూరు కు చర్యలు తీసుకుంటామని మంత్రి జడ్పిటిసిలకు వివరించారు..పంటలకు ఒక తడి నీరు ఇవ్వాలని నందికొట్కూరు ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తి మేరకు హంద్రీ నీవా నుంచి నీటిని విడుదల చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు..


గృహ నిర్మాణాలకు సంబంధించి గడివేముల జడ్పిటిసి ఇళ్లు పునాది వరకు కట్టుకున్నారని, వాటిని మంజూరు చేయాలని  కోరడంతో, శాంక్షన్ కాకుండా ఇళ్లు కట్టుకో వద్దని మంత్రి సూచించారు.. ఏ రాష్ట్రంలో లేని విధంగా గత ఐదేళ్లలో 30 లక్షల పట్టాలు ఇచ్చామని, లక్షలాది ఇళ్లు మంజూరు చేసామని మంత్రి తెలిపారు.. అయితే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని పూర్తి చేసిన తర్వాత మిగిలిన ఇళ్లను మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల కొత్తగా మంజూరు చేయలేక పోతున్నామని మంత్రి గడివేముల zptc కి వివరించారు..


జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ   ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడటం వల్ల కర్నూలు నంద్యాల జిల్లాల్లో పూర్తిగా తగ్గిపోయి తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అప్రమత్తంగా ఉండి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.. జలజీవన్ మిషన్ కింద ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాకు రూ.530 కోట్లు నంద్యాల జిల్లాకు రూ.300 కోట్లు మంజూరయ్యాయని ఈ నిధులను వినియోగించి పనులను సక్రమంగా చేయాలని చైర్మన్ సూచించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జల్జీవన్ మిషన్ కింద  individual గా టెండర్లు  పిలవాలని తీర్మానం చేశామని ఆ మేరకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. టెండర్లలో కూడా చాలామంది పాల్గొని, పురోగతి కనిపిస్తోందన్నారు.. ఈ పనులను వేగవంతం చేసి నీటి సమస్యలను తీర్చాలని సూచించారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించి, గ్రామాల్లో నీటి ఎద్దడిని లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు .. 


తుగ్గలి  మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తుగ్గలి జడ్పిటిసి కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ  తుగ్గలి మండలం తో పాటు కర్నూల్ అర్బన్ ను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని,  ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి  దృష్టికి కూడా వెళ్లడం కూడా జరిగిందని తెలిపారు..ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఫాలో అప్ చేస్తోందని,  కేంద్ర బృందం వచ్చి మండలాలను సందర్శించి అసెస్మెంట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వివరించారు..


నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మాట్లాడుతూ  నందికొట్కూరు నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు  సక్రమంగా జరగడం లేదని,  వేసవి కాలంలో తాగు నీటి సమస్య రాకుండా పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని  ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ కి సూచించారు..అలాగే  నందికొట్కూరు నియోజకవర్గంలోని నగటురులో  ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలకు  ముఖ్యమంత్రి  జమ చేసిన డబ్బును స్వాహా చేసినట్లు వార్తలు వచ్చాయని, ఎ పి ఎం, సి సి లు ఏమి చేస్తున్నారని ప్రశ్నించగా,  ఈ అంశం పై ఎంక్వయిరీ చేయాలని, ఒకవేళ అది నిజమైతే బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని  మంత్రి   నంద్యాల కలెక్టర్ ని ఆదేశించారు.. రైతులకు కోఆపరేటివ్ బ్యాంకుల నుండి మంజూరు చేసిన  లోన్లు  ఫిబ్రవరి లోపు కట్టకపోతే వేలం వేస్తామంటున్నారని, ఈ రుణాలను ఒక ఏడాది రీ షెడ్యూల్ చేయాలని ఎమ్మెల్యే కోరారు.


అనంతరం జిల్లా ప్రజా పరిషత్ & మండల ప్రజా పరిషత్ ల వార్షిక బడ్జెట్ 2024 - 2025 మరియు సవరణ బడ్జెట్ 2023-2024 లను ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదాన్ని పొందారు..


బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా పరిషత్ కు నిధులు వస్తున్నాయని తెలిపారు. 2014- 15లో రూ. 3.14 కోట్లు, 2015 -16 లో రూ.5.5 8 కోట్లు' 2016 -17 లో రూ.4.74 కోట్లు' 2017 -18 లో రూ.5.4 కోట్లు' 2018 -19లో రూ.4.13 కోట్లు, 2019 -20 లోరూ. 6.14 కోట్లు, 2020- 21 లో రూ.5.80 కోట్లు రాగా తమ పాలక వర్గం ఏర్పడినప్పటి నుండి  2021- 22లో రూ. 10.30 కోట్లు 2022-23 లో రూ.12.17 కోట్లు, 2023 -24 లో 11.14  కోట్లు, 2024 -25 లో రూ.13 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని వివరించారు..


అలాగే ఓల్డ్ జడ్పీ బిల్డింగ్ను లీజుకి ఇచ్చే అంశంపై స్టాండింగ్ కమిటీలో చర్చించామని ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతోందని చైర్మన్ సభ్యులకు తెలిపారు.

Comments