వివాదాలకు ఆస్కారం లేకుండా కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు.

 *వివాదాలకు ఆస్కారం లేకుండా కౌంటింగ్  కేంద్రాల ఏర్పాటు*

*•గుర్తింపు పొందిన పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి*

*•ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించండి*

*•ఎన్నికల బందోబస్తు, సీజర్ అంశాలపై ఎస్పీలతో ప్రతి వారం సమీక్షలు*

   *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా* 


అమరావతి, ఫిబ్రవరి 23 (ప్రజా అమరావతి): ఎటు వంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.  గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి  అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.  శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి  అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికల సంసిద్దతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. 

                                                                                                                                                                                          

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మరియు ఓటర్ల  నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందే ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరించాలని, నిర్ణీత కాలవ్యవధిలో ఆ ఫిర్యాదులను పరిష్కరించి,  తీసుకున్న చర్యలపై నివేదికను సంబంధిత  పార్టీల ప్రతినిధులకు, ఫిర్యాదుదారునికి అందజేయాలని సూచించారు.  అదే విధంగా దిన పత్రికల్లో వచ్చే  ప్రతికూల వార్తాంశాలపై కూడా తగు చర్యలు తీసుకుని, సంబందిత వివరాలను ప్రతివారం గుర్తింపు పొందిన  రాజకీయ పార్టీల ప్రతినిధులతో  నిర్వహించే సమావేశలో వివరించాలన్నారు.  


ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ మరియు ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా నియంత్రణ అంశాలకు సంబంధించి ప్రతి వారం సంబంధిత జిల్లాల ఎస్పీ లతో సమీక్షా సమావేశం నిర్వహించు కోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు.


ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టము యాప్ ఇప్పటికే సిద్దంగా ఉందని,  ఆ యాప్ ట్రయల్ రన్ ను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు.  ఈ లోపు ఆ యాప్ ను సంబందిత అధికారులు అందరు డౌన్ లోడ్ చేసుకోవాలని,  ఎన్ఫోర్సుమెంట్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీమ్లు, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సభ్యుల అంతా లాగిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 


ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపుకై ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలని,  ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన  పెండింగ్ లో నున్న దరఖాస్తుల వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకము, శిక్షణ తదితర అంశాలపై  కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన సమీక్షించారు.


ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు  అదనపు సిఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్,  జాయింట్ సిఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఈవో  కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

                                                                                                                                                                                            

Comments