ప్రశాంతంగా తొలి రోజు ఏపీ టెట్ పరీక్షల నిర్వహణ.

అమరావతి (ప్రజా అమరావతి);


*ప్రశాంతంగా తొలి రోజు ఏపీ టెట్ పరీక్షల నిర్వహణ*


• పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ .

• ఉదయం 86.37 శాతం మంది, మధ్యాహ్నం 87.54 శాతం మంది అభ్యర్థులు హాజరు.


రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ  నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష - 2024  మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని, అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని అన్నారు. 

మొదటిరోజు  పేపర్ 1 (ఎ) పరీక్షకు ఉదయం సెషన్ లో  17,136 మందికి  14,801 (86.37 శాతం) మంది,  మధ్యాహ్నం సెషన్ లో    17,253 మందికి   15,104 (87.54 శాతం)  మంది హాజరయ్యారని తెలిపారు.

పరీక్షా కేంద్రంలో  అభ్యర్థులకు  బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేయడం వల్ల తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా   40 మంది అభ్యర్థులకు మాత్రమే ముఖ హాజరు (ఫెషియల్ అటెండెన్స్) తీసుకోవడంలో సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు గుర్తించామన్నారు. ఏ అభ్యర్ధికి  నష్టం కలగకుండా వెంటనే సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. 

హాల్ టికెట్లో వివరాలు తప్పయితే సవరించుకోవచ్చు.

టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల పేరు, వివరాలు హాల్ టికెట్ లో  పూర్తిగా  తప్పుగా ఉన్నట్లయితే వారికి పరీక్ష రాయడానికి అనుమతి లేదు. అయినప్పటికీ అభ్యర్థికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లను జిల్లా విద్యాధికారి క్షుణ్ణంగా పరిశీలించి సదరు అభ్యర్థన సరైనదని భావిస్తే,  పూర్తి సవరణల వివరాలను రాష్ట్ర స్థాయిలోని కమాండ్  కంట్రోల్  రూం వారికి తెలియచేయాలి. అలాంటి అభ్యర్థులకు తర్వాతి సెషన్లో పరీక్ష రాసేలా బఫర్ హాల్ టికెట్ ఇవ్వనున్నట్లు కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు తెలిపారు.

ఆ అభ్యర్థుల ఫీజు తిరిగిచ్చేస్తాం.

అక్షర దోషాలు ఉన్నట్లయితే డిపార్ట్మెంటల్ అధికారి అభ్యర్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి పరీక్షకు అనుమతించాలని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల వల్ల బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1ఏ రాయడానికి అనుమతిలేకపోవడం వల్ల వారు చెల్లించిన ఫీజు అభ్యర్థి ఖాతాకు జమచేస్తామన్నారు. అదే విధంగా డీఈడీ, బీఈడీ రెండు అర్హతలు కలిగిన  అభ్యర్థులు పేపర్ 1 (ఎ) రాయడానికి వీలుగా బఫర్ హాల్ టికెట్లు అందజేస్తామన్నారు. అభ్యర్థులకు పరీక్షాపరంగా ఏవైనా సమస్యలు ఎదురైతే పరీక్షా తేదీకి ఒకట్రెండు రోజులు ముందుగా జిల్లా విద్యాధికారిని సంప్రదించాలని కోరారు.

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్ .

తొలి రోజు విజయవాడలోని ఏపీ టెట్ పరీక్షా కేంద్రాలైన గవర్నర్ పేటలోని ఎస్.వి.టి ఇన్ఫోటెక్ పరీక్షా కేంద్రాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ , శ్రీ విజయదుర్గా ఐటీ సొల్యూషన్స్( రామవరప్పాడు), ఐఆన్ డిజిటల్ జోన్ (కానూరు) పరీక్షా  కేంద్రాలను  పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ , ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ యు.వి.సుబ్బారావు సందర్శించారు. అభ్యర్థుల పరీక్షల  రాసే తీరును, పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.


Comments