విజయవంతంగా పల్స్ పోలియో.

 


*విజయవంతంగా పల్స్ పోలియో*



*విజయవాడ రాజ్ భవన్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్*


*చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన గవర్నర్ సతీమణి సమీరా నజీర్*


*చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాటుతూ పోలియో చుక్కల్ని వేసిన రాష్ట్ర ప్రథమ పౌరులు , రాష్ట్ర గవర్నర్ సతీమణి శ్రీమతి సమీరా నజీర్ గారు*


*పాల్గొన్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్*


అమరావతి (ప్రజా అమరావతి): నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యింది.   విజయవాడ రాజ్ భవన్ లో రాష్ట్ర ప్రథమ పౌరులు గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గవర్నర్ గారి  సతీమణి, రాష్ట్ర ప్రథమ మహిళా పౌరులు గౌరవ సమీరా నజీర్ గారు చిన్నారులకు పోలియో చుక్కల్ని వేశారు.   ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ శ్రీ జె. నివాస్, జెడి (సిహెచ్ &ఐ) డాక్టర్ కె.అర్జున్ రావు, స్టేట్ ఇమ్యునైజేషన్ అధికారి పీఓ డాక్టర్ ఎల్బిహెచ్ఎస్ దేవి, ఎన్టిఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుహాసిని, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎఎంహెచ్ఓ డాక్టర్ బాబూ శ్రీనివాస్, డిఐఓ డాక్టర్ అమృత తదితరులు పాల్గొన్నారు. 

పోలియో నిర్మూలన లక్ష్యంతో 1995లో భారతదేశంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించగా 2011లో మన దేశం పోలియో రహితంగా మారింది.    మన దేశంలో చివరి పోలియో కేసు 2011లో నమోదైంది. 2008లో నమోదయిన చివరి కేసుతో 15 సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలియో రహితంగా కొనసాగుతోంది. క‌మీష‌న‌ర్ శ్రీ జె. నివాస్‌, జాయింట్ డైరెక్ట‌ర్(చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేష‌న్‌) డాక్ట‌ర్ అర్జున‌రావు, స్టేట్ ప్రోగ్రాం ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ఎల్బీహెచ్ యస్ దేవి తదితరులు పాల్గొన్నారు. 

 పల్స్ పోలియో చుక్కల పంపిణీకి గాను రాష్ట్ర వ్యాప్తంగా 37,465 బూత్ లను ఏర్పాటు చేశారు.  దీనికి అదనంగా ఇంటింటి సందర్శన నిమిత్తం 74,930  టీమ్ లను, 1,693 మొబైల్ టీంలను హై రిస్క్ ప్రాంతాల్లో  ఏర్పాటు చేశారు.  మొత్తం కార్యక్రమ నిర్వహణ కోసం 1,55,420 మంది వాక్సినేటర్లను, 4,116 మంది సూపర్వైజర్లను నియమించారు.  లబ్దిదారుల సంఖ్య ఆధారంగా 67,76,100 డోస్ ల పల్స్ పోలియో వ్యాక్సిన్ ను అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు.  అదే విధంగా కార్యక్రమ ప్రచారానికి సంబంధించిన సామగ్రిని జిల్లాలకు అందచేశారు. వ్యాక్సిన్ నిర్వహణకు అవసరమైన ఐస్ బ్యాగ్స్ అందజేశారు.  3వ తేదీన బూత్ డేగా నిర్వహించారు.  ఈ రోజు ప్రజలందరూ తమ ఐదేళ్ళలోపు పిల్లలను తీసుకుని పల్స్ పోలియో కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు.  గ్రామీణ ప్రాంతాలలో 4, 5 తేదీలలో, పట్టణ ప్రాంతాలలో 4,5,6వ తేదీల్లో  మొబైల్ బృందాలు  ఇంటింటి సర్వే చేపట్టి వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తిస్తారు.  వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఇంటివద్దనే పల్స్ పోలియో చుక్కలేస్తారు.


Comments