రాష్ట్రాన్ని కాపాడుకునే లక్ష్యంతోనే టిడిపి, జనసేన, బిజెపిల పొత్తు.



*సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా జగన్ రెడ్డీ?!*


*చైతన్యవంతులైన రాష్ట్రప్రజలు హత్యారాజకీయాలను క్షమించరు*


*పరదాల మాటున బస్సు యాత్ర చేస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయా?*


*రాష్ట్రాన్ని కాపాడుకునే లక్ష్యంతోనే టిడిపి, జనసేన, బిజెపిల పొత్తు


*


*జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని కూలదోయడానికి జనమంతా సిద్ధం*


*కదిరి ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు*


కదిరి (ప్రజా అమరావతి):  ఈరోజు వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టు వద్ద పత్రికా విలేకరుల సాక్షిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా అని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. కదిరి ప్రజాగళం సభకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ... పులివెందులలో వైఎస్ వివేకాపై వేసిన గొడ్డలి వేటు శబ్ధం సమీపంలో ఉన్న కదిరికి వినిపించింది... వివేకాను ఎవరు, ఎందుకు, ఎలా చంపారో ఆనాటి ఆక్రందనలు విన్న కదిరి ప్రజలే సాక్ష్యం.  చిన్నాన అంటే తండ్రితో సమానం, బంధాలు, బంధుత్వాలకు మీకు అర్ధం తెలుసా?  చిన్నాన చనిపోతే ఆ చావు వెనక ఉన్న కుట్రలను ఇప్పటివరకు నిర్ధారించలేదు. న్యాయం కోసం పోరాడుతున్న చిన్నాన కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా? చిన్నాన చనిపోయి ఐదేళ్లవుతున్నా మీ ప్రభుత్వం ఏం చేసింది? అధికారంలో ఉన్న మీరు చేయాల్సిన పని సరిగా చేయకపోవడం వల్లే ఆమెకు న్యాయం చేయాలని నేను మాట్లాడాల్సి వస్తోంది.  వివేకాను హత్య చేసిన వారికి ముఖ్యమంత్రి రక్షణ కల్పిస్తున్నారు. వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని ప్రధాన నిందితుడు చెబుతున్నారు. గతంలో మీరు సిబిఐ విచారణ కోరారు... ఇప్పుడు మీరే వద్దంటున్నారు. చిన్నానను చంపిన నిందితుడికి ఓటు వేయమని అడగడం తప్పు కదన్నా అని చెల్లి మిమ్మల్ని అడుగుతోంది. నేను పోరాడేది న్యాయం కోసం,  మీలాగా పదవులకోసం కాదని సొంత చెల్లి సునీత అడిగే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి నేరాలు, ఘోరాలు చేసి వాటిని మన పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు... చైతన్యవంతమైన రాష్ట్రప్రజలు ఆయన హత్యా రాజకీయాలను క్షమించరు...వాటిపై పోరాడేందుకు మనమంతా సిద్దం కావాలి, అన్యాయానికి గురైన ఆడబిడ్డకు మనమందరం అండగా నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చిన్నానను చంపేశారంటూ మళ్లీ నంగనాచిలా మాట్లాడుతూ జగన్ కొత్త డ్రామా మొదలెట్టాడు. బాబాయిని చంపింది ఎవరో రాష్ట్రప్రజలందరికీ తెలుసు. జగన్ రెడ్డి మాత్రం బాబాయిని చంపింది దేవుడికే తెలుసంటున్నాడు. నిన్న ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్దకువెళ్లి , చిన్నానను చంపిన వాడిని ప్రక్కన పెట్టుకుని తండ్రి సాక్షిగా జగన్ రెడ్డి అబద్దాలు ఆడాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మనకు కావాలా?

*రాయలసీమకు ఎవరేం చేశామో ప్రజలు గ్రహించాలి*

కదిరికి కదలి వచ్చిన జనవాహినిని చూస్తే ఈ రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్ని టీవీలు పగులుతాయో తెలియదు. గత ఐదేళ్లుగా మన జీవితాలతో ఆడుకున్న ఫ్యాన్‌ను విసిరి డస్ట్ బిన్‌లో పడేయాలి. జగన్ రెడ్డి సిద్దం సభలకు అంటుంటే.. ప్రజలు జగన్‌ను ఓడించడానికి సిద్దం అంటున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ దిగిపోవాలి. నా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను. ఈసారి ప్రజల్లో నెలకొన్న ఉత్సాహం 1994 ఎన్నికల మాదిరగా ఉంది. నాడు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి తెలుగుదేశం విజయకేతనం ఎగురవేసింది .జగన్ రెడ్డి నమ్మిన వారిని నట్టేట ముంచే పచ్చి మోసకారి. దీనికి ఆయన రాయలసీమ చేసిన ద్రోహమే ఉదాహరణ. 2019 ఎన్నికల ముందు ఎన్నో మాయ మాటలు చెప్పాడు. రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీని 49 సీట్లలో ఇక్కడి ప్రజలు గెలిపించారు. ముద్దులుపెట్టాడు, బుగ్గలు నిమిరాడు. కానీ, జగన్ రెడ్డి రాయలసీమ ప్రజల కోసం చేసింది సున్నా. జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును పూర్తిచేయలేదు. ఒక్క ఎకరాకు నీళ్లవ్వలేదు. ఒక్క పరిశ్రమ తేలేదు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేశాడు. నేనూ రాయలసీమ బిడ్డనే. రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం  మా ప్రభుత్వం రూ. 12వేలకోట్లు ఖర్చుపెట్టింది కేవలం రూ. 2 వేలు కోట్లు మాత్రమే. హంద్రీనీవా కోసం తెలుగుదేశం ప్రభుత్వం రూ.4.200 కోట్లు ఖర్చు చేసింది. ఎవరు రాయలసీమ అభివృద్ధి కోసం పనిచేశారో ఎవరు రాయలసీమకు ద్రోహం చేశారో నిర్ణయించాల్సింది విజ్ఞులైన సీమ ప్రజలే.

*డ్రిప్ ఇరిగేషన్ తో అద్భుతాలు సృష్టించాం*

కరువుకు మారుపేరు రాయలసీమ. ఇక్కడి ప్రజలు కష్టజీవులు, మంచి భూములున్నాయి. కానీ సాగునీరు లేదు.  ఇక్కడి ప్రజలు బ్రతుకుదెరువు కోసం వలసలు  పోతున్నారు. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజల దాహార్తిని తీర్చాలని హంద్రీనీవాకు రూపకల్పన చేసిన మహాశిల్పి ఎన్టీఆర్. తెలుగుగంగ ద్వారా తమిళనాడుకు నీరివ్వాలని నాడు ప్రతిపాదిస్తే రాయలసీమ తర్వాతే చెన్నైకు నీరిస్తామని చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. నేను సి.ఎం అయిన తర్వాత హంద్రీనీవా, జీడిపల్లి, చెర్లోపల్లి, గొల్లపల్లి ప్రాజెక్టులను పూర్తిచేశా. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ నాగరికత, అభివృద్ధి, ఉపాధి, మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. వర్షపు నీటిని భూ గర్బజలాలుగా మార్చేందుకు 10 లక్షల పంటకుంటలు తవ్వించాం. చెక్ డ్యాంలు నిర్మించాం. తెలుగుదేశం ప్రభుత్వంలో బిందు సేద్యంతో అనంతపురం వాసులు అద్బుతాలు సృష్టించారు.  2019 తర్వాత టిడిపి ప్రభుత్వం కొనసాగిఉంటే అనంతను సస్యశ్యామలం చేసి ఇక్కడ పండిన పంటలను ప్రపంచ మొత్తానికి ఎగుమతి చేసేవాళ్ల. దుర్మార్గుల పాలనతో రాయలసీమకు ఒక్క పని చేసింది లేదు.

*కియా పరిశ్రమతో సీమ రూపురేఖలు మార్చాం*

తెలుగుదేశం ప్రభుత్వం కియా పరిశ్రమను రప్పించడం ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. నాడు ప్రతిపక్షంలో ఉండి వైసీపీ అడ్డుపడినా అనంతకు పరిశ్రమ రావాలని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పార్ధసారధితో చెప్పాం. కియా కార్ల కంపెనీ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేశాం. నేడు ఇక్కడ తయారైన 12 లక్షల కియా కార్లు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. కియాను తేవడం మన బ్రాండు అయితే.. వాటిని తరిమికొట్టడం జగన్ బ్రాండు. నేను కదిరికి నీళ్లు తెస్తే..జగన్ రాజకీయ హింస తీసుకొచ్చారు. నేను అనంతను హార్టికల్చర్ హబ్‌గా చేస్తే జగన్ వైసీపీ మాఫియా హబ్ మార్చాడు. ఇప్పుడు అనంత రైతులకు సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు, పొలాలకు నీళ్లు వస్తున్నాయా? మహిళలకు రక్షణ ఉందా? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? మెగా డీఎస్సీ పెట్టాడా?  విధ్వంసక పాలనలో కార్మికులకు కడుపునిండా తిండి లేదు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. పోలీసులకు మొదటి తారీఖున జీతాలు రావడం లేదు. ఉద్యోగుల ప్రావిడెట్ ఫండ్‌ను కూడా దోచుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారటీలకు కార్పొరేషన్ల నుంచి ఒక్క బ్యాంకు లోన్ ఇవ్వలేదు. అయిదేళ్ల దోపిడీ పాలనతో ఎవరు ఎంత నష్టపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముసుగు వీరుడు నిన్న బుల్లెట్ ప్రూఫ్ బస్సులో యాత్ర మొదలెట్టాడు.. బస్సు దిగి బయటకు రావడం లేదు. పరదాలు కట్టుకుని తిరిగితే ప్రజల సమస్యలు తెలుస్తాయా? నాలా ప్రజల మధ్య తిరిగే దైర్యం జగన్ కు ఉందా?

*మైనారిటీల విషయంలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దు!*

మైనారిటీల విషయంలో కూటమిపై వైసీపీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. ఇది రంజాన్ మాసం. దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్. ఖురాన్ పేదలకు సహాయం చేయమని చెబుతోంది. ఆ సిద్దాంతాన్నే తెలుగుదేశం నమ్ముతోంది. ఎన్డీఏలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా  ఉన్నప్పుడు 13 జిల్లాలలో ఉర్ధూను రెండవ భాషగా చేశాం. హైదరాబాద్‌లో ఉర్ధూ యూనివర్శిటీ తీసుకొచ్చాం. హాజ్ హౌస్ కట్టి జెడ్డాకు విమాన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మైనాటీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నేత నందమూరి తారకరామావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత కర్నూలు వేదికగా ఉర్దూ యూనివర్శిటీ కట్టాం. కడప, విజయవాడలో హజ్ హౌస్‌లు నిర్మించాం. మైనారిటీ విద్యార్ధులు విదేశాల్లో చదువుకునేందుకు కొన్ని వేల కోట్లు ఖర్చు చేశాం. మైనారిటీ ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.176 కోట్లు ఖర్చు చేసి 33 వేల మందికి ఆర్ధిక సహాయం చేశాం. రంజాన్ తోఫా, దుల్హన్, దుకాన్, మకాన్ పథకాలు తీసుకొచ్చాం. మైనారిటీలకు ఆర్ధికసహాయం చేశాం.  ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే బీజేపీ, జనసేనలతో జతకట్టాం. రాష్ట్రం అదోగతి పాలైంది. రూ.12 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్రాన్ని బాగుచేయాలంటే అందరం కలిసుండాలి. అందుకే అందరం కలిసి మీ ముందుకొచ్చాం. ఐదేళ్లుపాటు కేంద్రంలో ఎన్టీఏకు అన్ని విధాల సహకరించి ఇప్పుడు జగన్ నాటకలాడుతున్నాడు. తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నప్పుడు మైనారిటీలకు ఏనాడూ అన్యాయం జరగలేదు. ఎప్పుడో 4 శాతం రిజర్వేషన్లు పెట్టి వదిలేస్తే, 2014 నుంచి అనేకమంది లాయర్లను పెట్టి వాటిని కాపాడేందకు కృషి చేసిన పార్టీ తెలుగుదేశం. కదిరిలో ముస్లింలు, హిందువులు అందరూ ఉన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బిజెపితో మా కలయిక.

*విచ్చలవిడిగా గంజాయి జగన్ రెడ్డి పుణ్యమే*

కదిరిలో సైతం గజాయి విచ్చలవిడిగా దొరకడం జగన్ రెడ్డి పుణ్యమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కదిరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి లేకుండా చేసే బాధ్యత తీసుకుంటా. మెగా డీఎస్పీపై నా మొదటి సంతకం చేస్తా. రెండు, మూడు నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తా. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉంటే 8 సార్లు డీఎస్పీ ఇచ్చి 1.50 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చా. ఎన్టీఆర్ మూడు సార్లు డీఎస్పీలు ఇచ్చారు. కానీ జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. యువత తరపున నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?  మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్, పద్మావతి యూనివర్శిటీ, పొదుపు సంఘాలు, వంట గ్యాస్, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మరలా ఇప్పుడు మహిళలను ముందుపెట్టి వారి ద్వారా కుటుంబాలను పైకి తీసుకొస్తాం. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళకు ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి రూ.1500 వారి అకౌంట్లకే వేస్తాం. తల్లికి వందనం పథకం ద్వారా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ రూ.15 వేలు ఇస్తాం. కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే రూ.60 వేలు ఇస్తాం. ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రీగా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. మహిళలు చదువుకుంటే ప్రపంచాన్ని శాసిస్తారు. అన్నదాత కింద ప్రతీ రైతుకు రూ.20 వేలు ఇస్తాం. బిందు సేద్యం, సబ్సిడీలు, హర్టికల్చర్ కు ప్రోత్సాహం ఇస్తాం. జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజల సిద్దంగా ఉన్నారు. జగన్ రెడ్డి అహంకారానికి త్వరలో ఫుల్ స్టాప్ పడుతుంది.  తాడేపల్లిప్యాలెస్‌ పాపాలపుట్టను త్వరలో ప్రజలు బద్దలు కొడతారు.

*కదిరి పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దాం*

కదిరిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడి ప్రజలు బెంగుళూరు, చెన్నైకు ఉద్యోగాల కోసం వలస వెళ్లకుండా వారే ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. యువకులకు వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తాం. వారు ఇంటి దగ్గర కూర్చుని ప్రపంచ కంపెనీలలో పనిచేసే విధంగా చేస్తాం. మండల హెడ్ క్వార్టర్‌లలో వర్క్ స్టేషన్లు పెడుతాం. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వర్చువల్ విధానం తీసుకొస్తాం. కదిరి బైపాస్ రోడ్డును పూర్తి చేస్తాం. పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రాయచోటి రోడ్డు మీదుగా మదనపల్లి రోడ్డుకు అనుసంధానం చేసి కదిరి ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. కదిరిలో అసంపూర్తిగా ఉన్న ఉర్దూ, మైనార్టీ పాఠశాలను, పాలిటెక్నిక్ కళాశాలను పూర్తి చేస్తాం. మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్, హాస్టల్ నిజాంవలీ కాలనీ, ఫారెన్ స్కూల్ సమీప నిర్మాణాలను వాడుకలోకి తెస్తాం. కదిరిలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం.. అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులు చేపడతాం. ఆధునిక వసతులతో హిందూ స్మశానవాటిక నిర్మిస్తాం. కదిరిలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం. కోల్డ్ స్టోరేజ్, టమోటా ప్రెసెసింగ్ యూనిట్లు ఏర్పాటును పరిశీలిస్తాం. కదిరిలో ఇంజనీరింగ్ కాలేజీ, నంబులపూలకుంట, గాండ్లపెంటలో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయకూలీలకు ఉపాధిహామీ పథకంతో అనుసంధానం చేసే అంశంపై కేంద్రంతో మాట్లాడుతాం. ఉద్యోగస్తులకు మొదటితారీఖునే జీతం ఇస్తాం. జిల్లాలో మొట్టమొదటిసారిగా వడ్డెర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వడ్డెర సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించాం. భవిష్యత్తులో వడ్డెర్లకు చట్ట, సభల్లో ప్రాతినిథ్యం కల్పిస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు కూడా 46 రోజులు కష్టపడి దోపిడీ చేసే వైసీపీ పాలను తరిమికొట్టి మీ ద్వారా సంపద సృష్టించి పేదలకు అండగా నిలిచేది ఎన్డీఏ కూటమి. పేదవాళ్లను అప్పుల ఊబిలోకి నెట్టే పార్టీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి తప్ప ఎవరూ బాగుపడలేదు. ఇసుక, మద్యంలో ముడుపులు, ఖనిజ సంపద దోపిడీ, ఎక్కడ చూసినా సెటిల్మెందట్లు ఇవన్ని ఆలోచించి ఓటేసి ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించండి.


Comments