స్టేఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు.



*స్టేఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు


!*


*యువనేత ఎదుట చేనేత ప్రముఖుడి ఆవేదన*


*తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీ*


మంగళగిరి (ప్రజా అమరావతి): రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ గురువారం భేటీ అయ్యారు. మంగళగిరి 4వవార్డులో నివసిస్తున్న జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారి కుటుంబసభ్యులు యువనేతకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలతోపాటు చేనేతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. గతఏడాది అక్టోబర్ 5వతేదీన నిర్మాణంలో ఉన్న తమ భవనాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రోద్భలంతో అధికారులు కూల్చివేశారని ఆవేదన చెందారు. తమ ప్రాంత వాసులంతా దశాబ్ధాలుగా ఎండోమెంట్స్ భూముల్లో నివాసం ఉంటున్నామని తెలిపారు. తాము ఇల్లు నిర్మించుంటుండగా నిలిపివేయాలని ఎండోమెంట్ అధికారులు నోటీసులు జారీచేశారు. వెంటనే తాము హైకోర్టుకు వెళ్లగా స్టే ఇచ్చింది. సంబంధిత కాపీని తెచ్చేలోపుగా అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారని వాపోయారు. లోకేష్ స్పందిస్తూ... జగన్, ఆయన సామంతరాజులకు తెలిసింది కూల్చివేతలు మాత్రమేనని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఎండోమెంట్స్ వారికి ప్రత్యామ్నాయ భూమి చూపించి, దీర్ఘకాలంగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిచ్చేలా తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేతల ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని యువనేత హామీ ఇచ్చారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దుచేస్తామని, ముడిసరుకు సబ్సిడీతోపాటు చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అనంతరం 14వవార్డుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాండ్రు శ్రీనివాసరావును ఆయన కార్యాలయంలో యవనేత కలుసుకున్నారు. లోకేష్ మాట్లాడుతూ... మంగళగిరి చేనేతలపై తమకు ప్రత్యేకమైన ప్రేమ ఉందని, వారికి ఏ కష్టమొచ్చినా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు. అందులో భాగంగానే మంగళగిరిలో 25 అత్యాధునిక మగ్గాలతో వీవర్స్ శాలను ఏర్పాటుచేశామని, టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి మంచి మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని లోకేష్ కోరారు.


Comments