ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి):సిఇఒ మీనా.

 ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి):సిఇఒ మీనా



అమరావతి,11మే (ప్రజా అమరావతి):ఈనెల 13న జరిగే పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు అనగా 14వ తేది మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలియ జేశారు.ఈమేరకు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అధారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే  సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించాలని ఎపి ఎన్జీవో, ఎపి జెఎసి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్టు సిఇఓ స్పష్టం చేశారు.పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (పిఓ),అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఎపిఓ) ఇతర పోలింగ్ సిబ్బంది (ఒపిఓ)కి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) వర్తిస్తుందని తెలిపారు. 


కాగా పోలింగ్ విధులకై రిజర్వుడు సిబ్బందిగా  ప్రిసైడింగ్,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు,ఇతర పోలింగ్ సిబ్బందిగా డ్రాప్టు చేయబడిన వారికి ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తించదని సిఇఒ ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. వాస్తవంగా ఎవరైతే పోలింగ్ విధులు నిర్వహిస్తారో వారికి మాత్రమే ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ వర్తిస్తుందని సిఇఒ స్పష్టం చేశారు.


కావున అందరు జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఆదేశాలను రిటర్నింగ్ అధికారులందరికీ తెలియజేసి 13న పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని అప్పగించిన  తర్వాత పిఓ,ఎపిఓ,ఒపిఓలకు డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేసి 14న ఈ ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటి) సౌకర్యాన్ని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సిఇఒ మీనా ఆదేశించారు.


అదే విధంగా అందరు   కార్యదర్శులు,శాఖాధిపతులు, జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అధారిటీలకు ఈ ఆదేశాలను సర్క్యులేట్ చేసి  పోలింగ్ విధులు నిర్వహించిన వారికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలియజేశారు.



Comments