ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి రవాణా కోసం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు 5458 బస్సులను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఏర్పాటు చేసింది.

                                                                                     విజయవాడ (ప్రజా అమరావతి);



మే 13 వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి రవాణా కోసం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు 5458 బస్సులను  ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఏర్పాటు చేసింది.  ఇవి ఆర్టీసీ షెడ్యూల్ బస్సులలో సుమారు 55 శాతం బస్సులు.   

అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఓటు వేసేందుకు వచ్చే ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా రోజూ నడిచే సర్వీసులతో పాటు, అదనంగా మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి 1066 మరియు బెంగుళూరు నుండి 284 ప్రత్యేక బస్సులు కూడా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఏర్పాటు చేసింది.

 విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నవి. అంతేకాకుండా హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చే ప్రయాణికులు అత్యధికంగా ఉండడం వలన రద్దీని బట్టి మరికొన్ని ప్రత్యేక బస్సులు నడపబడుతున్నవి. 

ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయు నిమిత్తం ఆయా జిల్లాల అధికారులు బస్ స్టేషన్లలో పర్యవేక్షిస్తున్నారు. 

ఎక్కడైనా సుమారు 30 నుండి 40 మంది  ప్రయాణికులు ఒకే గమ్య స్థానానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నచో  ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ నెంబర్ 9959111281 సంప్రదించిన యెడల ఆ సమాచారాన్ని ఆయా జిల్లాల అధికారులకు తెలియజేసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయబడునని ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. తెలిపారు. 

Comments