2021 నాటికి భారతలో రెండు మిలియన్లకు పైగా అక్రమ వలసదారులు.
* బ్యూరో ఆఫ్ మిస్సింగ్ ఇండిడ్వల్స్ ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించిన ఎంపీ మహేష్ కుమార్.
* గత పదేళ్లలో 45 శాతం పెరిగిన విదేశీ విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు చర్యలు అవసరం.
* వలసలు మరియు విదేశీయులు బిల్లు -2025కు మద్దతుగా లోక్ సభలో ప్రసంగించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
దిల్లీ/ ఏలూరు, మార్చి 27 (ప్రజా అమరావతి): వలసలు మరియు విదేశీయుల బిల్లు 2025 చర్చలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మన దేశ భద్రతను బలోపేతం చేయడంతో పాటు, వసుదైవ కుటుంబం స్ఫూర్తిని కొనసాగించేందుకు తీసుకున్న పురోగామి నిర్ణయానికి ఎంపీ మహేష్ కుమార్ సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈ బిల్లును తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ఎంపీ మహేష్ కుమార్ అభినందనలు తెలిపారు.
భారతదేశం ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత, జాతి, లింగ భేదాలకతీతంగా ప్రజలను స్వాగతించింది. ఒక దేశంలోకి ప్రవేశించి అక్కడ సమాజంలో భాగమవ్వాలంటే సరైన నియమాలు, ప్రక్రియలు ఉండాలి. అక్రమ వలసలు దేశానికి పెద్ద సమస్యగా మారింది. అంచనాల ప్రకారం గత దశాబ్దంలో భారతదేశంలో అక్రమ వలసదారుల సంఖ్య వార్షికంగా 10-15% పెరిగింది. 2021 నాటికి 2 మిలియన్లకు పైగా అక్రమ వలసదారులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి, ముఖ్యంగా పొరుగు దేశాల నుండి ఎక్కువ మంది వచ్చారు. ఇది మన వనరులు, మౌలిక సదుపాయాలు, భద్రతా వ్యవస్థపై భారాన్ని పెంచుతుందని ఎంపీ మహేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
నలందా విశ్వవిద్యాలయం కాలం నుంచే భారత్ ప్రపంచ విద్యా కేంద్రంగా ఉంది. వైద్యశాస్త్రం, ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, భారతీయ సంస్కృతి, చరిత్ర మొదలైన అంశాలపై ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చి ఇక్కడ అభ్యసించారు. గత 10 ఏళ్లలో విదేశీ విద్యార్థుల సంఖ్య 45% పెరిగింది. ప్రతి ఏడాదికి 160 దేశాల నుండి 50,000 మందికి పైగా విద్యార్థులు భారతదేశంలో చేరుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థుల సమాచారాన్ని భద్రంగా ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎంపీ మహేష్ కుమార్ సూచన చేశారు.
గత ఐదేళ్లలో ఆరోగ్య, పర్యాటక రంగం 18 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి చెందింది. కోవిడ్ తర్వాత భారతదేశ వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. 2023 నుంచి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా ఆరోగ్య పర్యాటకులు భారత్కు వచ్చారు, వీరి ద్వారా 9 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆరోగ్య పర్యాటకుల సమాచారాన్ని సమర్థవంతంగా, భద్రంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించే విధంగా డేటా భద్రతా చట్టాలను అమలు చేయాలని ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఈ బిల్లులో వలసల పర్యవేక్షణ విభాగం ఏర్పాటు గురించి ప్రస్తావించబడింది. ఇది దేశంలోకి వచ్చే విదేశీయులపై పర్యవేక్షణ చేయడమే కాకుండా, విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులను రక్షించే విధంగా కూడా పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలు, మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు అదృశ్యం అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. వారి కుటుంబాలకు తీవ్ర వేదన కలుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు "బ్యూరో ఆఫ్ మిస్సింగ్ ఇండిడ్వల్స్" (Bureau of Missing Individuals) అనే ప్రైవేట్ మెంబర్ బిల్లును ఎంపీ మహేష్ కుమార్ ప్రతిపాదించారు. ఇందులో, తప్పిపోయిన వ్యక్తుల కోసం డేటాబేస్ను ఏర్పాటు చేసి, రాష్ట్రాల మధ్య దర్యాప్తును మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇమిగ్రేషన్ బ్యూరోలో ఇటువంటి అంశాన్ని చేర్చాలని ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
"ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ బిల్లు- 2025 జాతీయ భద్రతను పరిరక్షించడంతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడే సమతుల్యమైన చట్టం.
ఈ బిల్లులో నియంత్రిత వలస విధానం, మెరుగైన అమలు విధానాలు ఉన్నాయి, తద్వారా భారతదేశం భద్రమైన మరియు సుస్వాగత దేశంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ బిల్లును పూర్తిగా మద్దతు ఇస్తున్నాను, మరియు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.. అంటూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన ప్రసంగాన్ని ముగించారు.
addComments
Post a Comment