ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం.

 *ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరిస్తాం*


*గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది*


*అసెంబ్లీలో వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి*


అమరావతి,మార్చ్ 19 (ప్రజా అమరావతి): 

 ఆహార పదార్థాల్ని కల్తీ చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని

 వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ చట్టాల మేరకు రాష్ట్రంలో ఆహార కల్తీని నిరోధించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు బుధవారం  శాసనసభలో సభ్యులు ఆహారకల్తీపై సంధించిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.  మానవ వినియోగానికి సంబంధించిన ఆహార వస్తువుల అమ్మకం, నిల్వ, పంపిణీ దిగుమతుల వంటివాటి నియంత్రణ, పర్యవేక్షణకు సంబంధించి 2006 నాటి ఆహార భద్రత, ప్రమాణాల చట్ట నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ చట్టం రాష్ట్రంలో ఆహార భద్రతా అధికారుల ఆధ్వర్యంలో అమలవుతోందని చెప్పారు.  ఆహార భద్రతా కమీషనర్, జిల్లాలోని అధికారులు, ఇతర చట్టబద్ధమైన కార్యనిర్వాహక అధికారులు, అడ్జుడికేటింగ్ అధికారి, ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్ట్ వంటి విభాగాలు ఈ చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయని వివరించారు.  ఆహార భద్రతకు నియమించిన అధికారులు తినుబండారాలను, వారి సంబంధిత అధికార పరిధిలో వున్న తయారీదారులు, హోల్ సేలర్లు, రిటైలర్ల వంటి వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారని చెప్పారు.   ఆహార నమూనాలను సేకరించి సమీప ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నారని, 2006 ఆహార భద్రతా ప్రమాణా చట్ట నిబంధనల ప్రకారం సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు. 2019-2024 మధ్య కాలంలో మొత్తం 45,509 ఆహార నమూనాలను సేకరించి విశ్లేషించారని, అందులో 2,473 నమూనాలు నిబంధనలను ఉల్లంఘించినట్లుగాను, 654 నమూనాలు సురక్షితమైనవి కానట్లుగాను, 1,779 నమూనాలు నాణ్యత లేకుడా తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిందని మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా వివరించారు.  2006 ఆహార భద్రతా చట్టం సెక్షన్ 59 ప్రకారం సురక్షితం కాని ఆహార నమూనాలకు సంబంధించి విచారణకు, పెనాల్టీతో జైలు శిక్ష విధించేందుకు సంబంధిత జిల్లాల మేజిస్ట్రీట్ కోర్టు సమక్షంలో కేసు నమోదు చేయబడ్డాయని మంత్రి తెలిపారు.   చట్టంలోని సెక్షన్ 68 (నాణ్యతలేని, తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్, తదితర ఉల్లంఘనలకు సంబంధించి) ప్రకారం 1779 కేసులను సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమక్షంలో నమోదు చేసినట్లు తెలిపారు.  నేరం యొక్క తీవ్రత ఆధారంగా చట్టంలోని 50-59 సెక్షన్ కింద గ్రేడెడ్ జరిమానాలను చట్టం ప్రతిపాదిస్తోందని, దీని ప్రకారం పౌర జరిమానాలు (నాణ్యత లేని, తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ తదితర ఉల్లంఘనలకు)తో పాటు సురక్షితం కాని ఆహారం విక్రయించిన వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించాలని చట్టం నిర్దేశిస్తోందన్నారు. చిన్న నేరాలకు లక్ష నుండి 10 లక్షల రూపాయల వరకూ జరిమానాలను నిర్దేశించిందని, పెద్ద నేరాల విషయంలో కనీస జైలు శిక్ష ఆరు నెలల నుండి ఆరేళ్ల వ్యవధి వరకూ ప్రతిపాదించిందని వివరించారు. ఆహారం తినటం వల్ల వ్యక్తి మరణిస్తే జైలు శిక్ష ఏడేళ్ల కంటె తక్కువగా వుండరాదని చట్టం నిరందేశించిందని, దీనిని జీవిత ఖైదు వరకూ పొడిగించేందుకు అవకాశం కల్పిస్తోందని మంత్రి వెల్లడించారు.  దీనితో పాటు రు.10 లక్షలకు పైబడిన జరిమానా కూడా విధించవచ్చన్నారు.  ఇప్పటి వరకూ దాదాపు 1,365 చిన్న నేరాల కేసులను, పెద్ద నేరాల (సురక్షితం కాని ఆహారం)కు సంబంధించి 110 కేసులను జాయింట్ కలెక్టర్, అడ్జుడికేటింట్ అధికారి నిర్ణయించారని, రెండు సందర్భాలలో మొత్తం రు.1.69 కోట్ల మేర జరిమానా విధించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సమాధానంలో వివరించారు.

Comments