వేస్ట్ మేనేజ్ మెంట్ కు మున్సిపల్ శాఖ అధిక ప్రాధాన్యత .

 

విజయవాడ (ప్రజా అమరావతి),


                        వేస్ట్ మేనేజ్ మెంట్ కు మున్సిపల్ శాఖ అధిక ప్రాధాన్యత 


•  బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాటు వదిలివేయాలి.

•  నాలుగు థీమ్ లుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నాము.

• స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే విధానంపై త్వరలో రూట్ మ్యాప్

• సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం 

- శ్రీ. పొంగూరు నారాయణ, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు

     వేస్ట్ మేనేజ్ మెంట్ కు పంచాయితీ, పురపాలక సంఘాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ అన్నారు. స్వచ్చాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్,బిహేవియరల్ చేంజ్ పై సోమవారం ఒక రోజు వర్క్ షాప్ విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్క్ షాప్ నకు హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతిరోజూ 6500 టన్నుల సాలిడ్ వేస్ట్ వస్తుందన్నారు. గత ప్రభుత్వం 80లక్షల టన్నుల చెత్తను వదిలివెళ్లిందని, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 2 లోపు చెత్తనంతా తొలగించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. మున్సిపాలిటీల్లో సాలిడ్ వేస్ట్,లిక్విడ్ వేస్ట్ తొలగించడం ఎంతో సవాల్ తో కూడుకున్నదని, అయితే ఇతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చెత్తను తొలగించడానికి తీసుకుంటున్న ఉత్తమ నిర్ణయాలను క్రోడీకరించి మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఏరోజుకారోజు ఈ చెత్తనంతా తొలగించాలన్న దృక్పదంతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 

         నాలుగు థీమ్ లు గా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని, వాటిని క్రమబద్ధంగా అమలు చేసి దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలను ఏ మేరకు సమర్థవంతంగా అమలు చేశామన్నది అన్నింటికన్నా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండ అవగాహన కలిగిఉండాలన్నారు. అలాగే చెత్త పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడం, రీసైక్లింగ్ పై  చైతన్యం కలిగించే అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నామని తెలిపారు. వాటిల్లో భాగంగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర నిర్వహిస్తున్నారని, దీంతో ప్రజల్లో చెత్త నిర్వహణపై అవగాహన పెరిగిందన్నారు. ప్రజలకు అవగాహన ఎలా కల్పించాలి? ఎలాంటి ప్రచారం నిర్వహించాలి అనే దానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛత యొక్క ప్రాధాన్యత తెలిసేలా రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. 

                స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడి పట్టాభి మాట్లాడుతూ వేస్ట్ మేనేజ్ మెంట్ లో మన రాష్ట్రం అగ్రగామిగా నిలవాలంటే రాష్ట్రం లో ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఇక్కడకి వచ్చిన స్టేక్ హోల్డర్స్ అంతా ఎంతో అనుభవజ్ఞులని వారి సలహాలు, సూచనలు స్వీకరించి స్వచ్ఛత విషయంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రణాళికలు రూపొందిస్తామని పట్టాభి రామ్ అన్నారు. అలాగే గత నెల యూరోప్ పర్యటన సందర్భంగా 8 కంట్రీస్ లో  ముఖ్యంగా గమనించింది, వారి జీవన శైలిలో స్వచ్ఛతపై ప్రజల్లో ఉన్న అవగాహన అమోఘమన్నారు. అక్కడి ప్రజలు సైతం ప్లాస్టిక్ బిన్ లో ప్లాస్టిక్, పేపర్ బిన్ లో పేపర్ ఇలా వాటికి కేటాయించి బిన్లలో వాటినే వేస్తున్నారని తెలిపారు.  అలాగే మన రాష్ట్రంలో కూడా రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. మనం తీసుకునే ప్రక్రియ ఏదైనా టార్గెటెడ్ గా ఉంటే ఫలితాలు కూడా త్వరగా వస్తాయని అందులో విద్యార్దులు,మహిళలు, ఉద్యోగులు వారికి తగిన కంటెంట్ ప్రణాళిక బద్దంగా తయారు చేసి ఇస్తే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలిపారు. మహిళలకు మరింత చేయుతనిస్తూ వారికి అవగాహన కల్పిస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలమన్నారు. విదేశాల్లో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ లో స్వచ్ఛత పైన పాఠ్యాంశాలు ఉన్నాయని అలాగే రాష్ట్రం లో కూడా మునిసిపల్ శాఖ మంత్రి  నారాయణ గారు అలాగే విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా చిన్నారుల పాఠ్య పుస్తకాలలో స్వచ్ఛత గురించి పొందు పరచినట్లయితే విద్యార్ధులకు చిన్నతనం నుండే స్వచ్ఛతపై బాధ్యత పెరుగుతుందని పట్టాభి రామ్ అన్నారు.

         ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ విదేశాల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తారన్నారు. మన దేశంలో కూడా శాశ్వతంగా స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రజలు తమ కల్చర్ లో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో మన రాష్ట్రం గతేడాది 6 స్థానం లో ఉందని, ఈ ఏడాది మన రాష్ట్రం ర్యాంక్ మరింత మెరుగుపరుచుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ను డ్రైయిన్లలో వేయరాదని, అలా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 

                     అనంతరం మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి డైరక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి. అనిల్ కుమార్ లు ఐఈసీ పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్జీవో  సంస్థలు, స్టేక్ హోల్డర్స్, ట్రైనింగ్ ఇనిస్టిస్ట్యూట్స్, పంచాయితీ, మున్సిపల్ శాఖాధికారులు పాల్గొన్నారు.


Comments