రక్షణ మరియు క్షిపణి పరికరాల తయారీలో అగ్రగామిగా నిలవనున్న ఆంధ్రప్రదేశ్.

 

విజయవాడ (ప్రజా అమరావతి),

 


*రక్షణ మరియు క్షిపణి పరికరాల తయారీలో అగ్రగామిగా నిలవనున్న ఆంధ్రప్రదేశ్


*


సమగ్ర  విధానం,  వ్యూహాత్మక చర్యల ద్వారా విమానయాన మరియు రక్షణ తయారీకి ఒక ప్రధాన కేంద్రంగా మారాలనే దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందన్న  పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి, శ్రీ.N.యువరాజ్.

                

   రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో  రక్షణ, క్షిపణి విధానం, పారిశ్రామిక క్లస్టర్ల రూపకల్పన కోసం  పారిశ్రామిక భాగస్వాములతో సోమవారం విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2025-2029 సంవత్సర కాలానికి విడుదల చేయబోతున్న రక్షణ మరియు క్షిపణి విధానం 4.0 పై పలు వ్యాపార భాగస్వాముల నుండి సలహాలు, సూచనలు మరియు అమలు విధానం వంటి అంశాలు ముఖ్య ఉద్దేశాలుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి , పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి  శ్రీ.N.యువరాజ్, స్పేస్ టెక్నాలజీ,  ప్రభుత్వ సలహాదారు శ్రీ.S.P.సోమనాథ్,  శ్రీ.సతీష్ రెడ్డి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, తెలంగాణ మరియు ఆంధ్ర సబ్ ఏరియా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు శ్రీ. కేశినేని శివనాద్, APIIC చైర్మన్ శ్రీ. మంతెన రామరాజు వంటి ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

             

 పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి, శ్రీ.N.యువరాజ్, మాట్లాడుతూ “ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగానికి పెరుగుతున్న డిమాండ్, భౌగోళిక రాజకీయ తెగింపులు మరియు విస్తరిస్తున్న భద్రతా భిన్నత్వాల నేపథ్యంలో, దేశం భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రక్షణ రంగంలో వ్యూహాత్మక మార్పులకు ఆంధ్ర ప్రదేశ్ శ్రీకారం చుట్టిందన్నారు.  దీనికి తోడుగా భారత ప్రభుత్వం కూడా తన ఆపన్న హస్తాన్ని అందిస్తూ రక్షణ నిర్మాణ రంగానికి గతం లో ఎన్నడు లేని విధంగా బడ్జెట్ కేటాయింపుల వలన రక్షణ మరియు క్షిపణి రంగాలను అభివృద్ధి చేయాలనే  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దృడ సంకల్పంను  ప్రతిబింబిస్తుందన్నారు.

                  

 పెట్టుబడులను ఆకర్షించడం, మరియు యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వార ఉపాది అవకాశాలను కల్పించడంపై రాష్ట్రం కట్టుబడి ఉందన్నారు. దీని వలన భారత విమానయాన మరియు రక్షణ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో రక్షణ పరికరాల తయారీకి ప్రైవేటు భాగస్వాముల సహకారం ఎంతో అవసరమన్నారు.  స్థానిక తయారీ వ్యవస్థకు 2019 లోనే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని దీని వలన రక్షణ రంగానికి సంబంధించిన వార్షిక ఉత్పత్తి రూ. 1.27 లక్షల కోట్లుగా ఉందన్నారు. మన దేశం నుండి  85 దేశాలకు రక్షణ రంగానికి సంబంధించిన పరికరాలను ఎగుమతి చేస్తున్నామన్నారు. CAGR(2016-17) లెక్కల ప్రకారం ప్రైవేటు భాగస్వాముల ద్వారా 21% రక్షణ రంగానికి సంబంధించిన పరికరాల తయారీకి దోహదం చేస్తుందన్నారు. కానీ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) లో వెనుకపడ్డామని దానిని అధిగమించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు భాగస్వాముల సహకారం అవసరమన్నారు. 

                  

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలనుకునే అభివృద్ధిదారులకు భూమిని మరియు ప్రోత్సాహకాలను అందించడానికి సిద్దంగా ఉందని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి డెల్టాల మినహా మిగిలిన ప్రాంతాలలో 30 కి పైగా క్లస్టర్ లను గుర్తించిందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 3 పారిశ్రామిక కారిడార్ లను ప్రకటించిందని తెలిపారు. ఆర్థిక అభివృద్దికి, పారిశ్రామిక ప్రగతికి అందుబాటులో ఉన్న మన అపార భూ సంపదను అభివృద్దికి ఆలంబనగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తుందన్నారు.రాష్ట్రంలోని తయారీ పరిశ్రమను ప్రోత్సహించడానికి, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 ను అమలు పరిచేందుకు నాలుగు ప్రాద్యామ్యలుగా విభజిస్తూ: 1- విమానాలు, క్షిపణి 2- ఆయుదాలు 3- నావికా మరియు నౌకా నిర్మాణం  4- రక్షణ ఎలక్ట్రానిక్స్ గా  4.0 ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు.. ఈ సమగ్ర విధానం ద్వారా రక్షణ మరియు క్షిపణి విమాన రంగాలలో రూ. 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 50,000 ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వం లో స్వర్ణాంధ్ర 2047 కి అనుగుణంగా పనిచేస్తున్నామని యువరాజ్ తెలిపారు.

               

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు శ్రీ.సతీష్ రెడ్డి మాట్లాడుతూ “రక్షణ రంగంపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయంపులను భారీగా  పెంచిందన్నారు. అగ్రరాజ్యాలు ఎల్లప్పుడూ కీలక రక్షణ వ్యవస్థల మరియు స్వదేశీ ఉత్పత్తి వ్యూహాన్ని అనుసరించాయని తెలిపారు . స్థానిక తయారీ రంగాలకు డిమాండ్ పెరిగిందని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ లో  రక్షణ మరియు క్షిపణి పరికరాల తయారీ రంగాలలో అగ్రగామిగా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. రాజస్థాన్, అస్సాం మరియు గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా రక్షణ మరియు క్షిపణి పరికరాల తయారీ రంగాలకు సంబందించి విధానాలను ఇప్పటికే విడుదల చేశాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రక్షణ రంగ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రోత్సాహకాలతో కూడిన సమగ్ర విధానాన్ని రూపొందించుకోవాలని సూచించారు. 

                     

స్పేస్ టెక్నాలజీ ప్రభుత్వ సలహాదారు,  డాక్టర్.S.P.సోమనాథ్, మాట్లాడుతూ “ఖగోళ రంగంలోని అవకాశాలను ప్రస్తావిస్తూ, ముఖ్యంగా భారతదేశం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ విజయాలను ఎన్నో సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్టప్స్ లేకపోవడం మన లోపం అని ఆయన అన్నారు. ఖగోళ రంగంలో ప్రస్తుతం టెక్నాలజీలకు అధిక డిమాండ్ ఉందని, ఈ అవసరాలను తీర్చగలిగే స్టార్టప్ లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వాలు సమగ్ర విధానాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు అని తెలిపారు. శ్రీహరి కోటలో నూతనంగా ఏర్పాటు చేసిన లాంచ్ ప్యాడ్ ద్వారా 50 శాటిలైట్లను రాబోయే 5 ఏళ్లలో నిర్మించి ప్రయోగించాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతున్న తరుణంలో రాష్ట్రానికి మరింత ప్రయోజనం కలగనుంది అని తెలిపారు.. 


మేజర్ జనరల్ అజయ్ మిశ్రా మాట్లాడుతూ “ఆయుధబలాల సేనలు స్థానికీకరించిన తయారీకి సంబంధించిన సమస్యలను గుర్తించాయని తెలిపారు. సేనకు బడ్జెట్ నికరాలలో 60% కేటాయించడం వల్ల తయారీదారులకు డిమాండ్ పెరుగుతుందని ఆయన అన్నారు.  2032 నాటికి 85% స్థానికీకరణ లక్ష్యాన్ని సేన నిర్ణయించుకుందని ఆయన వివరించారు.

               

    విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడుతూ ఈ సమావేశం కేవలం రాష్ట్రంలో ప్రైవేటు భాగస్వాముల ద్వారా వ్యాపార సామర్ధ్యాన్ని పెంచడమే కాకుండా ఒక చారిత్రాత్మిక మార్పుకు నాంది పలికిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన స్వర్ణాంధ్ర 2047 కు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రైవేటు భాగస్వాముల సహకారం చాలా అవసరమన్నారు.

             

APIIC చైర్మన్ మంతెన రామరాజు  మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మరియు భవిష్యత్తుకు ప్రైవేటు భాగస్వాముల తోడ్పాటు చాల ముఖ్యమని వారి వ్యాపారాలకు సంబంధించిన సమస్యలకు సత్వరమే పరిష్కార మార్గాలను అందించడానికి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు.

              

    సమావేశంలో భాగంగా కార్యక్రమానికి హాజరయిన పలువురు వ్యాపారవేత్తలు, పబ్లిక్ సంస్థల యజమానులు తమ సూచనలను, వారు ఎదుర్కుంటున్న సమస్యలను , వినతులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 

ఈ సమావేశానికి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖాధికారులు,  వ్యాపార సంస్థల యజమానులు హాజరయ్యారు. 



Comments