రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం వెన్నెముకలా నిలిచింది .

 రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం వెన్నెముకలా నిలిచింది  


ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల మందికి సొంత ఊళ్లలోనే ఉపాధి

నీటి సంక్షోభ నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం 

శిథిలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పంచాయతీరాజ్ నిధులే ప్రాణంపోశాయి 

మద్యం అమ్మకాల్లో గత పాలకులు రూ. 3200 కోట్లు నొక్కేశారు 

సారాయి సాణువుల మీద కోట్లు కూడబెట్టారు 

ఉపాధి శ్రామికులతో మేడే దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం అటవీ, సైన్స్  మరియు టెక్నాలజీ శాఖ మంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్ 


గుంటూరు, 01 మే 2025 (ప్రజా అమరావతి): గత ఐదేళ్ల పాలనలో శిథిలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పంచాయతీరాజ్ నిధులే ప్రాణవాయువులా మారాయని,  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకలా నిలుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం అటవీ, సైన్స్  మరియు టెక్నాలజీ శాఖ మంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్  తెలిపారు.

గురువారం మంగళగిరిలోని సీకే కన్వన్షన్ హలులో మేడే సందర్భంగా ఉపాధి శ్రామికులతో ఆత్మీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం అటవీ, సైన్స్  మరియు టెక్నాలజీ శాఖ మంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిబూషణ్, కమిషనర్ కృష్ణ తేజ తో కలసి పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధి శ్రామికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా  ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం అటవీ, సైన్స్  మరియు టెక్నాలజీ శాఖ మంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వ పాలకులు... సారాయి సాణువుల మీద కోట్లు కూడబెట్టార’న్నారు. మద్యం తయారు చేసి, మద్యం అమ్మి, మద్యం మీద వచ్చే ఆదాయంలో దాదాపు రూ.3200 కోట్లు దోచుకున్నట్లు ఇప్పటి వరకూ తేలిందన్నారు.  గత ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద రూ.10,669 కోట్లు ఖర్చు చేశామని, 75.23 లక్షల కార్మికులకు సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించామని వెల్లడించారు. ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కండ కరిగించి, రక్తం ధారపోసే శ్రామికుడే లేకపోతే దేశ ప్రగతి ముందుకు సాగదని,  దేశ అభివృద్ధిలో భాగమవుతున్న ప్రతి శ్రామికుడికి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.  మే డే సందర్భంగా నేటి నుంచి ఉపాధి హామీ పథకం కూలీలు అనే పేరును... ఉపాధి హామీ శ్రామికులుగా మారుస్తున్నట్లు చెప్పారు. “గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు. నాకు పల్లెలు అంటే విపరీతమైన ఇష్టం. గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షిస్తాను. శ్రమ విలువ నాకు తెలుసు కాబట్టి ఉపాధి శ్రామికుల విలువ నాకు తెలుసు. కండలు కరిగించేవారు లేకపోతే మన దేశంలో కట్టడాలు ఉండవు, హరితహారాలు ఉండవు, పచ్చదనం ఉండదు. అందుకే శ్రమపడే వారిని ఈ దేశాన్ని నిర్మించే శ్రామికుడిగా గుర్తించాలి. కార్మిక దినోత్సవాన మిమ్మల్ని ఉపాధి కూలీలుగా కాకుండా దేశ నిర్మాణంలో చమటోడ్చే శ్రామికులుగా గుర్తిస్తున్నాం. ఈ రోజు నుంచి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఒక ఇంజినీర్, సైంటిస్ట్, డాక్టర్ లు మాత్రమే గొప్ప కాదు. పని చేసే ప్రతి శ్రామికుడు గొప్పే.  కండని కరిగించి, రక్తాన్ని ధారపోసే మీ శ్రమ నిజమైన శ్రమ. ఉపాధి శ్రామికులు లేకపోతే రాష్ట్ర నిర్మాణం, దేశ నిర్మాణం ఉండదు. మీకు ఉపాధి కల్పించడం పట్ల సంతోషిస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం వెనుక అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడం మినహా ఇతర కారణాలు లేవు. దేవుడి దీవెనలు, అందరి సహకారంతో ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఐదేళ్లలో మీకు ఎంత వరకు మద్దతుగా నిలవగలం అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మూగ జీవాలు ఓట్లు ఇవ్వవు. వాటి వల్ల ఓట్లు రాలవు. మనిషికి దాహం వేస్తే అడగగలడు. మూగ జీవులు అడగలేవు. స్పందన ఉన్నవారికి మాత్రమే మూగ జీవాల రోధన అర్ధం అవుతుంది. ఆ స్పందన నాతోపాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులందరికీ ఉంది. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించినట్టు మూగజీవాల దాహర్తి తీర్చేందుకు గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణం కార్యక్రమం ద్వారా పంచాయతీరాజ్ అధికారులు పూనుకున్నారు.

ఉపాధి హామీ పథకం ఒక వరం

ఉపాధి హామీ పథకం మన రాష్ట్రానికి, దేశానికి ఒక వరం. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలై, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిన పరిస్థితుల్లో పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణ వాయువు అయ్యాయి. ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు 46 లక్షల 94  వేల కుటుంబాలు, 75 లక్షల 23 వేల మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లో ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 24.23 కోట్ల పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకు 100 రోజులపాటు పని కల్పించాం. గత ఆర్థిక సంవత్సరం రూ.10,669 కోట్లు ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేశాం. అందులో రూ. 6,194 కోట్లు వేతనాలకే ఖర్చు చేశాం. ఏ స్థాయిలోనూ లంచాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల గతంలో రూ.150 మించని వేతనాలు ఇప్పుడు రూ.307కి పెంచి ఇవ్వగలుగుతున్నాం. ఈ పనులకు రూ. 4,023 కోట్లు మెటీరియల్ కోసం ఖర్చు చేశాం. ఉపాధి శ్రామికుల కష్టం గ్రామాభివృద్ధికి బాటలు వేస్తోంది. 

పల్లెల్లో పండగ వాతావరణం

పల్లెల్లో పండగ వాతావరణం మధ్య ఉపాధి పనులను ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే పల్లెల్లో ఉపాధి పనులకు పల్లె పండుగ అని నామకరణం చేశాం. పల్లె పండుగ నిజంగా పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకువచ్చింది. పల్లె పండుగ ద్వారా ఇప్పటి వరకు రూ. 377.37 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 21,564 గోకులాలు పూర్తి చేశాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పశువుకీ నీడ కల్పించడం వల్ల ప్రతి రైతుకీ అదనంగా నెలకి రూ. 4,200 ఆదాయం లభిస్తోంది. ఉపాధి శ్రామికుల కష్టం ఫలితంగా గ్రామాల్లో 13,500 పశువుల తొట్టెలు, రూ. 60.75 కోట్లు ఖర్చుతో పూర్తి చేశాం. అందుకు ప్రతి శ్రామికుడికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మీ శ్రమ ఫలితంగా రూ. 317.91 కోట్ల ఖర్చుతో 63,582 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాం. ఈ కార్యక్రమం ద్వారా ఎకరాకి రూ. 50 వేల ఆదాయం లభిస్తుంది. రూ.1800 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేశాం. ఈ ఏడాది మరో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించబోతున్నాం. డోలీ మోతలు మినహా ఆంబులెన్స్ సైరన్ వినిపించని గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయంటే దాని వెనుకా ఉపాధి శ్రామికుల శ్రమ దాగి ఉంది. ఉపాధి శ్రామికుల సంక్షేమం, అభివృద్ధిని ముఖ్యమంత్రి                            శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు తీసుకువెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి గారి సహకారంతోనే మీ మోముల్లో ఆనందం చూడగలుగుతున్నాం.

ఒకే రోజు కోటి మంది ఉపాధి శ్రామికులకు బీమా

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు మొగల్తూరు పర్యటనకు వెళ్లిన సమయంలో ఉపాధి శ్రామికులకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం లేదన్న విషయాన్ని గుర్తించారు. ఉపాధి పనుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎలా న్యాయం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఒకే రోజు కోటి మంది ఉపాధి శ్రామికులకు ప్రధాన మంత్రి సురక్ష యోజన, జీవన జ్యోతి యోజన పథకాల కింద బీమా నమోదు చేశాం. తద్వారా ప్రమాదవశాత్తు పనిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల భరోసా లభిస్తుంది. వేసవిలో ఉపాధి శ్రామికులు ఉపాధి పనులు ఉదయం 11 గంటల లోపు ముగించేలా చూసుకోండి. నిర్దేశిత పనులు మిగిలి ఉంటే సాయంత్రం 4 గంటల తర్వాత కొనసాగించండి. ఎండ తీవ్రంగా ఉంటే నీడ పట్టున ఉండడానికి ప్రయత్నం చేయండి. పని ప్రదేశాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ఉపాధి శ్రామికులకు రోజుకి రూ. 307 వేతనం అందేలా అన్ని చర్యలు చేపట్టాం. ఉపాధి హామీ వేతనాలు దేశంలోనే మొట్టమొదటి సారి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధి హామీ సిబ్బంది సంక్షేమం కోసం కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  సిబ్బందికి రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించేందుకు ఎస్.బి.ఐ. తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఒక పార్టీ అధినేతగా కార్యకర్తలు దురదృష్టవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు బీమా వచ్చే ఏర్పాటు చేశాం. దేశ నిర్మాణంలో భాగస్వాములైన ఉపాధి సిబ్బంది సంక్షేమం కోసం ఆలోచించి ఈ బీమా ఒప్పందాన్ని చేశాం. ప్రధాని శ్రీ మోదీ గారి నిర్దేశకత్వం, దార్శనికత, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న మన కూటమి ప్రభుత్వం ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యయంగా ముందుకు వెళ్తోంది. ఉపాధి శ్రామికులు ఇచ్చిన స్ఫూర్తితో ఈ ఏడాది కూడా 27,500 గోకులాలు నిర్మిస్తాం. 1,55,000 ఎకరాల్లో ఫారం పాండ్లు పూర్తి చేస్తాం. లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు, మరో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల మేర డ్రైనేజీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 

నీటి సంక్షోభం నివారణకు వార్ రూమ్ 

రాష్ట్రంలో దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటే, గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నీరు లభ్యత సక్రమంగా ఉన్నా కలుషితంగా మారిపోయాయి. అవనిగడ్డ, బందరు ప్రాంతాల్లో భూగర్భజలాలు ఉప్పు నీటిగా మారిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రక్షిత మంచినీరు చాలా ప్రాధాన్యం అయిపోయింది. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలంటే దాదాపు రూ.87 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనాతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. వాళ్లు పరిశీలించి ఇప్పటి వరకు రూ. 29 వేల కోట్లకు అనుమతులు ఇచ్చారు.  పూర్తి స్థాయిలో పనులు చేయాలంటే ఇంకో రూ.57 వేల కోట్లు అవసరం. అనివార్య కారణాల వల్ల  కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలి అన్న దానిపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాం.  

నీటి సంక్షోభాన్ని అధిగమించడానికి వార్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఏ విధంగా వార్ రూమ్ ఏర్పాటు చేస్తాయో...  పంచాయతీ రాజ్ శాఖ బలంగా పనిచేయడానికి వార్ రూమ్ ఏర్పాటు చేశాం. పల్లెల్లో పనులు ఎలా జరుగుతున్నాయి? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? నీటి ఎద్దడి పరిస్థతి ఏంటి..? వర్షపు నీటిని ఎలా ఆదా చేయాలి వంటి వాటిపై చర్చించాం. 

వర్షపు నీటిని ఒడిసి విపట్టడంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి 

వర్షపు నీటిని వృథా చేయకూడదు. వర్షపు నీటి సేకరణపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రతి ఇంటికి, కమ్యూనిటి భవనాలకు వర్షపు నీటి హార్వెస్టింగ్ పద్ధతులు ఏర్పాటు చేయాలి. తాగు నీటి అవసరాల కోసం, భవిష్యత్తు తరాల కోసం నీటి నిల్వను పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి గ్రామంలో ఫిల్టర్ బెడ్లను పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు చేసి శుద్ధమైన నీటిని ప్రజలకు అందిస్తాం. ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పని చేస్తున్నాయా.? లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించాలి. వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నీటి నమూనాలను పరీక్షించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలి. వేసవిలో నీటి కొరత రావచ్చు... ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలి. వాటర్ వార్ రూమ్ లను స్టేట్ ఆర్ డబ్ల్యూఎస్ హెడ్ క్వార్టర్స్, జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసి ప్రతి రోజు నీటి అందుబాటు, నీటి సరఫరా పర్యవేక్షించాలి. అవసరమైతే నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికి సరఫరా చేయాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా నీటిని వినియోగించాలి. నీటి పరిరక్షణపై పాఠశాల, కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, ప్రచారాలు చేయిస్తాం. ప్రకృతి నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటాం. వేసవిలో విద్యార్థులకు, యువతకు నీటి సంరక్షణలో అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేస్తాం. వారికి వేసవి ఇంటర్న్ షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తాం. నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలో వీరి సహకారం తీసుకుంటాం.  13,326 పంచాయతీలు బాధ్యత గా పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకోగలుగుతాం” అని అన్నారు. 

 పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పని అడిగిన వారికి వారి స్వంత గ్రామంలోనే పని కల్పించటమే ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం అన్నారు. గత సంవత్సర కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ఉప ముఖ్యమంత్రి , పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నేతృత్వంలో ఉపాధి హామీ పథకం పనులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఉపాధి శ్రామికులకు పనిదినాలు కల్పిస్తూ గ్రామీణాభివృధ్ది కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పల్లేపండుగ ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, గోకులాలు, పంట కుంటలు, నీటి తొట్టెల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో 2024-25 ఆర్ధిక  సంవత్సరంలో ఉపాధి హామీ పథకం క్రింద రూ. 86,000 కోట్లు ఖర్చుపెడితే రాష్ట్రంలోనే రూ.10,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ నేతృత్వంలో రానున్న ఆర్దిక సంవత్సరంలో మరింతగా ఉపాధి హామీ పథకం పనులు చేపట్టడం జరిగిందన్నారు.

సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధి హామీ శ్రామికులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి  ఉపాధి హామీ పథకం పనుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, శ్రామికులకు వేతనాలు సక్రమంగా అందుతున్నందుకు ప్రత్యేకంగా దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.  ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల పాకల నిర్మాణానికి , పంట కుంటల నిర్మాణానికి, ఉద్యాన పంటలు సాగుకు, పశువుల దాణా సాగుకు నిధులు ఇవ్వటం ద్వారా రైతుల ఆర్దికాభివృద్ధికి దోహద పడుతుందన్నారు. ఉపాధి శ్రామికుల ప్రమాదవ శాత్తు పని ప్రదేశాల్లో మరణిస్తే అందించే పరిహారాన్ని రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచినందుకు దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులను ఉపాధి హామీ పథకంకు అనుసంధానం చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని కోరారు.

అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం అటవీ, సైన్స్  మరియు టెక్నాలజీ శాఖ మంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్ సమక్షంలో ఉపాధి హామీ సిబ్బంది బీమా కు సంబంధించి ఎస్ బీ ఐ తో ఎంఓయు చేశారు.

ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. మరియు వాటర్ షెడ్స్    సంచాలకులు  షణ్ముఖ్,  సోసైటీ ఫర్  సోషల్ అడిట్, ఎక్కౌంట్ బులిటీ మరియు ట్రాన్స్ పెరన్సీ  డైరక్టర్ జి శ్రీకాంత్, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ అడిషనల్ కమిషనర్  శివప్రసాద్,  జాయింట్ కమిషనర్ సునీత, శివరాం ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధి హామీ పధకం శ్రామికులు పాల్గొన్నారు.

Comments