- మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ఆరు రోజుల్లో పూర్తి చేయవచ్చు
- దీనిపై ఎస్ఇసి వెంటనే నిర్ణయం తీసుకోవాలి
- రాష్ట్రంలో ఎన్నికల వల్ల వాక్సినేషన్ ప్రక్రియ మందగించింది.
- పరిషత్ ఎన్నికలు పూర్తి చేస్తే వాక్సినేషన్పై ప్రభుత్వం పూర్తి దృష్టి సారిస్తుంది.
- ఇకపై మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల పదవుల పెంపు
- దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తోంది
- ప్రజలకు మరింత జవాబుదారీతనంతో పనిచేసేందుకే ఈ నిర్ణయం
- సీఎం శ్రీ వైయస్ జగన్ కులాలు, మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారు
- తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి హిందుత్వ ఎజెండాతో వచ్చినా ప్రజలు పట్టించుకోరు
- అమరావతిలో జరిగిన భూదందాపైన సిఐడి విచారిస్తోంది
- చంద్రబాబుపై మాకు ఎటువంటి కక్ష లేదు
- మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి (ప్రజా అమరావతి):
గతంలో సగంలోనే నిలిపి వేసిన మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు న్యాయపరమైన అవాంతరాలతో పాటు అన్ని అడ్డంకులు తీరిన నేపథ్యంలో తక్షణం ఎస్ఇసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సచివాలయంలోని పబ్లిసిటి సెల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా హైకోర్ట్ సైతం పరిషత్ ఎన్నికల వ్యాజ్యంపై తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించాలని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే....
1) తిరుపతి పార్లమెంట్ స్థానంకు ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరుగనున్న నేపథ్యంలో వైయస్ఆర్సిపి అత్యధిక మెజార్టీతో ఈ స్థానంలో విజయం సాధిస్తుంది. తాజాగా జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్సిపి సాధించిన మెజార్టీలను పరిగణలోకి తీసుకుంటే తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపు మూడు లక్షలకు పైగా మెజార్టీని సాధిస్తామని విశ్వాసం వుంది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పట్ల ప్రజల్లో వున్న విశ్వసనీతకు స్థానిక సంస్థల ఎన్నికలు అద్దం పట్టాయి. అదే స్పూర్తితో తిరుపతి ఉప ఎన్నికలోనూ మంచి మెజార్టీని ప్రజలు అందిస్తారు.
2) ఎస్ఇసి వంటి సంస్థలకు నియంత్రణతో కూడిన అధికారాలు వుంటాయి. పదవి వుందని ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదనే విషయం ఈ రోజు హైకోర్ట్ తీర్పు ద్వారా స్పష్టమవుతోంది. పరిషత్ ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో... అక్కడి నుంచే ప్రారంభించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఏకగ్రీవాలు అయిన చోట్ల పెండింగ్లో పెట్టిన డిక్లరేషన్ ఫాంలను కూడా ఇవ్వాలని కోర్ట్ చెప్పింది. గతంలో ఎస్ఇసి కూడా సుప్రీంకోర్ట్లో వేసిన అఫిడవిట్లో ఎక్కడ నుంచి ఎన్నికలు నిలిపివేశామో అక్కడి నుంచే ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పింది. ముందుగా జరపాల్సిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను పక్కకుపెట్టి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను జరిపింది. తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకు, వైయస్ఆర్సిపిని ఇబ్బంది పెట్టేలా ఎస్ఇసి వ్యవహారం చేసింది.
3) ఈ రోజు హైకోర్ట్ తీర్పును దృష్టిలో పెట్టుకుని, నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే ఆరు రోజుల్లో మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికల కమిషనర్ తక్షణం ఈ ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నాం. దేశమంతా కోవిడ్ వాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియకు కొంత ఆటంకం ఏర్పడింది. ఎస్ఇసి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే మండల, జిల్లాపరిషత్ ఎన్నికలను కూడా పూర్తి చేస్తే, ఆ తరువాత ప్రభుత్వం పూర్తిస్థాయిలో వాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి సారించేందుకు వీలు పడుతుంది.
4) మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రజలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు మరింత జవాబూదారీతనంతో సేవలను అందించేందుకు ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, అలాగే ఒక మేయర్, ఒక డిప్యూటీ మేయర్లు వుంటే, ఇకపై అదనంగా మరో వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్లు వుండేలా ఆర్డినెన్స్ తీసుకువస్తున్నాం. ఈ నెల 18వ తేదీన యుఎల్బిసిల్లో చైర్మన్లు, మేయర్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాలని ఎస్ఇసి నోటిఫికేషన్ ఇచ్చిందని దాని ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ఆర్డినెన్స్ తరువాత రెండో వైస్ చైర్మన్, రెండో డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ప్రజలకు అందుబాటులో వుండి, మరింత సేవ చేసేందుకు గానూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎక్కువ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జవాబూదారీతనం కూడా పెరుగుతుందని అన్నారు.
5) తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి హిందుత్వ ఎజెండాతో పోటీకి సిద్దమవుతోందని విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... ఈ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సీఎం శ్రీ వైయస్ జగన్ పాలన సాగుతోంది. అన్ని మతాలకు సమానమైన గౌరవాన్ని అందిస్తూ పాలన సాగిస్తున్నారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే మూడు నెలల్లో కొత్త రథాన్ని తయారు చేసి ఇచ్చాం. విజయవాడలో చంద్రబాబు హయాంలో అరవైకి పైగా ఆలయాలను సుదంరీకరణ పేరుతో ద్వంసం చేశారు. చివరికి చెత్తబండిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని తరలించిన ఘటనను కూడా రాష్ట్రప్రజలు చూశారు. చంద్రబాబు హయాంలో ద్వంసం చేసిన ఆలయాలను మా ప్రభుత్వం పునరుద్దరిస్తోంది. అందుకోసం అవసరమైన నిధులను కూడా సీఎంగారు మంజూరు చేశారు. అటువంటి మా ప్రభుత్వంపై కులాలు, మతాల రంగును పులిమేందుకు నీచ రాజకీయం చేస్తున్నారు.
6) చంద్రబాబుపై మాకు ఎటువంటి కక్షసాధింపు లేదు. అమరావతి భూదందాలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిఐడి విచారిస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విచారణలో భాగంగానే చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతోంది. కానీ చంద్రబాబుకు గతంలో తాను సోనియాగాంధీతో కలిసి వైయస్ జగన్ గారిని ఏరకంగా తప్పుడు కేసుల్లో ఇరికింది పదహారు నెలలు జైలుకు పంపాడో, అలాగ మిథున్రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి పదహారు రోజులు ఎలా జైలుకు పంపాడో గుర్తుకు వస్తున్నట్లు వుంది. తాను చేసినట్లే అందరూ చేస్తారని ఆయన అనుకుంటున్నారు. కానీ అమరావతి భూదందాలో అక్రమాలను బయటపెట్టేందుకే ఈ విచారణ జరుగుతోంది.
addComments
Post a Comment