విజయవాడ (ప్రజా అమరావతి),.
జడ్ పిటిసి, యంపిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం..
మొత్తం ఓటర్లు 20,04,417 మంది .
..
జిల్లాలో 41 జడ్.పి.టి.సి. , 648 యం.పి.టి.సి. స్థానాలకు ఎన్నికలు ..
ఏప్రిల్ 8 న ఉ. 7 గంటల నుండి సా.5 గంటల వరకూ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు ..
6 వ తేది సా. 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగింపు ..
జిల్లాలో 2 జడ్ పిటిసి, 69 యంపిటిసి స్థానాలు ఏకగ్రీవం..
**జడ్ పిటిసికి 159 మంది , యంపిటిసి స్థానాలకు 1631 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు..
...కలెక్టరు ఇంతియాజ్
జిల్లాలో జడ్ పిటిసి, యంపిటిసి స్థానాలకు జరిగే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు . స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టరు (రెవెన్యూ ) డా. కె. మాధవిలత, జెసి ( సంక్షేమం ) కె. మోహన్ కుమార్, జడ్ పి సిఇఓ పి.సూర్యప్రకాష్ లతో కలిసి కలెక్టరు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో జడ్ పిటిసి , యంపిటిసి స్థానాలకు ఈనెల 8 గురువారం ఉ . 7 గంటల నుండి సా . 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు . ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని , ఇటీవల జరిగిన గ్రామస్థాయి , మున్సిపల్ స్థాయి ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు 80 శాతంకు పైగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు . అదే చైతన్యం ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారని కలెక్టరు ఆశాభావం వ్యక్తం చేశారు . జిల్లా వ్యాప్తంగా 2409 పోలింగ్ కేంద్రాల పరిధిలో 20,04,417 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని కలెక్టరు తెలిపారు . వీరిలో పురుషులు 9,91,054 మంది , మహిళలు 10,13,253 మంది , ఇతరులు 110 మంది ఓటర్లు ఉన్నారన్నారు . ఎన్నికల నిర్వహణకోసం 17,204 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని ఇంతియాజ్ తెలిపారు . రిటర్నింగ్ అధికారులు 46 మంది , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 46 మంది పిఓలు 3,150 మంది , ఏపిఓలు 3,152 మంది పోలింగ్ సిబ్బంది 9,335 మంది విధుల్లో పాల్గొంటారన్నారు . ఎ న్నికల ప్రక్రియను పరిశీలించేందుకు గాను జోనల్ అధి కారులు 160 మంది , రూట్ ఆఫీసర్లు 280 మంది , మైక్రో అబ్జర్వర్స్ 679 మంది , ఫ్లయ్యింగ్ స్క్వాడ్స్ 98 మంది , యంసిసి బృందాలు 92 మంది , సర్వైయల్ టీమ్స్ 91 మంది , అకౌంటింగ్ టీమ్స్ 75 మంది పాల్గొంటారన్నారు . మొత్తం 125 జోన్ లు , 234 రూట్లలో రూట్ మ్యాప్ సిద్ధం చేశావున్నారు . మొత్తం 11,883 బ్యాలెట్ బార్లు సిద్ధంగా ఉన్నాయన్నారు . పోలింగ్ సిబ్బందికి ఏప్రిల్ 4 న , మైక్రో పరిశీలకులకు ఏప్రిల్ 5 న , కౌంటింగ్ సిబ్బందికి 6 వ తేదీన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు .
జిల్లాలో 49 మండలాలు ఉండగా , 41 మండలాల పరిధిలోని జడ్ పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు . మచిలీపట్నం , పెనమలూరు , జగ్గయ్యపేట మండలాల్లో గ్రామాల విలీనం నేపథ్యంలో జడ్ పిటిసి ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు . ఉంగుటూరు , మండవల్లి జడ్ పిటిసి స్థానాలు ఏకగ్రీవం అవ్వడంతోనూ , గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్ధులు మరణించినందున జి.కొండూరు , విస్సన్నపేట , పెడన జడ్ పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు . ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న 41 జడ్ పిటిసి స్థానాలకు 159 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు . 49 జిల్లాలో మండలాల పరిధిలోని 648 యంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు . మొత్తంలో 69 యంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని , గ్రామాల విలీనం , తదితర కారణాల వలన 89 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని , 6 స్థానాల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్ధులు మరణించిన కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు . అవి నాగాయలంక ( పర్రచివార ) , ముదినేపల్లిలోని ముదినేపల్లి -2 , వనుదుర్రు , గన్నవరంలో అల్లాపురం , పెనుగ్రంచిపోలులో కొనకంచి , నూజివీడులో దేవరగుంట యంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు . ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 8 వ తేది ఉ . 7 గంటల నుంచి సా . 5 గంటల వరకు జరుగుతుందని , అప్పటికీ క్యూ లైన్ లలో ఉన్నవారందరికీ ఓటుహక్కు కల్పిస్తామని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. 6 వ తేది మంగళవారం సా. 5 గంటలతో అభ్యర్ధులు ప్రచారాన్ని ముగించాలన్నారు . జిల్లాలోని 23 కేంద్రాలు ద్వారా ఎన్నికల సామాగ్రి పంపిణి , కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు . ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని మొత్తం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . జిల్లాలో ఇప్పుడు జరగబోయే జడ్ పిటిసి , యంపిటిసి స్థానాలకు కూడా అధిక శాతంలో ఓటింగ్ నమోదు అవుతుందని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కలెక్టరు తెలిపారు . కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి ఎ టువంటి ఇబ్బందులు లేవని , మెడికల్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయలేదని ఆయన తెలిపారు .
addComments
Post a Comment