*స్పందన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి*
*: గడువు తీరిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలి*
*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
అనంతపురం, జూలై 26 (ప్రజా అమరావతి) :
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ శ్రీకారం చుట్టారు. కరోనా కారణంగా గత ఏడాది నుంచి వాయిదా పడిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డిఆర్ఓ గాయత్రీ దేవిలు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
స్పందన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్.
స్పందన సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరం చూపించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. సోమవారం వచ్చిన స్పందన సమస్యలను వచ్చే సోమవారం నాటికి పూర్తిగా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు, జిల్లా వ్యాప్తంగా డివిజన్, మండల స్థాయి అధికారుల లాగిన్ లలో పెండింగ్ ఉన్న గడువు తీరిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మానిటర్ చేస్తున్నారని, స్పందన సమస్యలు పెండింగ్ ఉంచకుండా జాగ్రత్తగా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ సమస్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్ ఉంచరాదన్నారు. గడువు తీరిన స్పందన గ్రీవెన్స్ సమస్యలను మంగళవారంలోపు అధికారులు తమ లాగిన్ లో చెక్ చేసి వాటిని పరిష్కరించడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలోని అధికారులు గడువు తీరిన సమస్యలను చూడాలని, స్పందన సమస్యల పరిష్కారం పై సీరియస్ గా దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 548 స్పందన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, అందులో జిల్లా సాండ్ (ఇసుక) ఆఫీసర్, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖలకు సంబంధించి అత్యధిక అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటికి పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
ఈరోజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా మొత్తం 380 అర్జీలు వచ్చాయి. ఇందులో కొన్ని సమస్యల వివరాలు ఇలా ఉన్నాయి.
తాడపత్రి స్వర్ణకార కార్మికులకు 2019 సంవత్సరంలో తాడిపత్రి గ్రామం పొలం సర్వే నెంబర్ 1280 మరియు 1281 నందు ప్రభుత్వం ఇంటి పట్టాలను మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఈశ్వరమ్మ తదితరులు స్వర్ణకార కార్మికులు ఇల్లు నిర్మించుటకు అడ్డంకులు కలిగిస్తున్నారని, ఈ విషయంలో తమకు న్యాయం చేయవలసిందిగా జావిద్, రమేష్ తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు.
పెనుకొండ పట్టణానికి చెందిన కంసాలి రమాదేవి తన భర్త శ్రీనివాసులు గత మాసంలో కరోనా వలన మరణించడం జరిగిందని, తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, ఎలాంటి ఆస్తులు లేవని, ప్రస్తుతం కుటుంబ పోషణ కూడా భారంగా ఉందని పేర్కొంటూ తనకు ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని వేడుకుంటూ అర్జీని సమర్పించింది.
నల్లమల్ల మండలం యం. బడవాoడ్లపల్లికి చెందిన వికలాంగుడు జనార్ధన్ కు సర్వే నంబర్ 251 లో 2 సెంట్లభూమి మంజూరు అయినప్పటికిని సంబంధిత విఆర్ఓ ఇంతవరకు పట్టాను ఇవ్వకుండా ఇబ్బంది కలిగిస్తున్నారoటూ వినతి పత్రం సమర్పించారు.
జిల్లాలో ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా నిమిత్తం కోడిగ్రుడ్లు నాసిరకంగా చెడిపోయిన కోడిగుడ్ల ఒక్కొక్కడివిజన్లో ఒక్కొక్క రేటు వేస్తూ ధనార్జనే ధ్యేయంగా లబ్ధి పొందుతున్న సదరు కాంట్రాక్టర్ ను రద్దుపరచ కొత్త టెండర్ తో నాణ్యమైన కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రామన్న, ధనుంజయ తదితరులు వినతి పత్రాన్ని సమర్పించారు.
అనంతపురం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కరోనా రోగులకు సేవలు అందించిన ఫ్రంట్లైన్ వారియర్స్ కి మూడు నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ సూర్యనారాయణ, కృష్ణ మోహన్ తదితరులు అర్జీ సమర్పించారు.
చాగల్లు రిజర్వాయర్ లో ముంపుకు గురైన వంద కుటుంబాలు ప్రస్తుతం పనులు లేక ఇబ్బంది ఓకే పడుతున్నారని, వారందరికీ జీవనోపాధి కరకు ప్రభుత్వం తరఫున చేపల పెంపకం చేసుకొన అనుమతిని మంజూరు చేయా ఆస్పత్రినాధ్, రామచంద్ర తదితరులు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ ప్రేమ చంద్ర, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, హార్టికల్చర్ డిడి సతీష్, సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరప్రసాద్, శ్రీనివాసులు, డిఈఓ శామ్యూల్, డిటిడబ్ల్యూఓ అన్నాదొర, స్పందన తహశీల్దార్ అనుపమ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment