ట్రైకార్ ఆధ్వర్యంలో రూ.271 కోట్లతో డైరీ, పౌల్ట్రీ ప్రాజెక్టులు
• గిరిజన యువతకు స్వయం ఉపాధి శిక్షణలు
• ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వెల్లడి
• ట్రైకార్ ఛైర్మెన్ సతక బుల్లిబాబు బాధ్యతల స్వీకరణ
విజయవాడ, ఆగష్టు 11 (ప్రజా అమరావతి): రాష్ట్ర షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) ఆధ్వర్యంలో రూ.271 కోట్లతో పశుసంవర్థక, పెరటి కోళ్ల పెంపకం ప్రాజెక్టులను చేపట్టనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గిరిజన యువతకు స్వయం ఉపాధిని కల్పించే కార్యక్రమాలకు కూడా ఈ ఏడాది ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
ట్రైకార్ ఛైర్మెన్ గా ప్రభుత్వం నియమించిన సతక బుల్లిబాబు బుధవారం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై బుల్లిబాబును అభినందించారు. ఈ నేపథ్యంలోనే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, ట్రైకార్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీ ఏరియాలోని గిరిజనుల జీవనోపాధుల అభివృద్ధిలో భాగంగా ట్రైకార్- ఐటీడీఏల సంయుక్త భాగస్వామ్యంలో పశుసవర్థక ప్రాజెక్టును అమలు చేయడానికి రూ.242.89 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 242 గోకులాలను నిర్మించనున్నట్లు తెలిపారు. అదే విధంగా 13,500 గిరిజన కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రూ. 28.34 కోట్లతో పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించిన ప్రాజెక్టును అమలు చేయనున్నామని వివరించారు. గిరిజన యువతకు స్వయం ఉపాధిని కల్పించే కార్యక్రమాలకు కూడా ట్రైకార్ ద్వారా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం తేనె కు వినియోగదారుల్లో డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో తేనెటీగల పెంపకంలోనూ యువతకు శిక్షణ ఇచ్చి, వారికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా అందించనున్నామని పుష్ప శ్రీవాణి వివరించారు. ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోనూ యువతకు ఉద్యోగ హామీ కలిగిన శిక్షణలు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. కాగా ట్రైకార్ ఛైర్మెన్ గా పదవీ బాధ్యతలను చేపట్టిన బుల్లిబాబును ఉప ముఖ్యమంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగానే ట్రైకార్ ఛైర్మెన్ సతక బుల్లిబాబు మాట్లాడుతూ, తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ట్రైకార్ ఎండి ఈసా రవీంద్రబాబు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
ఫోటోవార్త: ట్రైకార్ ఛైర్మెన్ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన సతక బుల్లిబాబును అభినందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి
addComments
Post a Comment