అన్నదాతల హెూదాకు చిహ్నం ఒంగోలు గిత్తలు



- నాణ్యమైన పశు సంపదగా ఒంగోలు జాతికి ప్రపంచస్థాయి గుర్తింపు 

- అన్నదాతల హెూదాకు చిహ్నం ఒంగోలు గిత్తలు 


- మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని 

- న్యాయ నిర్ణేతలు సాంబిరెడ్డి, సుబ్బారావులకు సన్మానం పశు పోషకులకు మెమెంటోల బహుకరణ 



గుడివాడ, జనవరి 13 (ప్రజా అమరావతి): నాణ్యమైన పశు సంపదగా ఒంగోలు జాతికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే కన్వెన్షన్లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) పర్యవేక్షించారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న వింతా సాంబిరెడ్డి, కనపర్తి సుబ్బారావులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను బహుకరించారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల జతల యజమానులకు ప్రోత్సాహకంగా మెమెంటోలను అందజేశారు. అనంతరం కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) మాట్లాడుతూ నడకలో రాజఠీవి, కొండలనైనా కదిలించగల బలం ఒంగోలు జాతి గిత్తల సొంతమని అన్నారు. ఈ జాతి పశువులు పౌరుషానికి ప్రతీకగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఒంగోలు జాతి పశువుల ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఒంగోలు జాతి గిత్త నడిచి వస్తుంటే ఆ రైతు ఆనందానికి పట్టపగ్గాలు ఉండవన్నారు. రైతు ప్రతిష్ఠకు, అన్నదాతల హెూదాకు ఒంగోలు జాతి పశువులు చిహ్నంగా నిలుస్తుంటాయన్నారు. ఒంగోలు జాతి పశుపోషణ భారం కావడంతో వీటి సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. ఆకారం, కొమ్ములతో విలక్షణంగా ఉంటాయని, ఈ కారణంగా ఇతర జాతి పశువుల నుండి ఒంగోలు జాతి పశువులను తేలికగా గుర్తించవచ్చన్నారు. వీటి కొమ్ములు కురచగా, మూడు నుండి ఆరు అంగుళాల పొడవుతో బయట వైపునకు ఉంటాయన్నారు. విశాలమైన కాళ్ళు, చిన్న ముఖం, వెడల్పాటి నుదురు, పెద్ద చెవులు, పెద్ద గంగుడోలు కల్గివుంటాయన్నారు. నడిచేటపుడు అటూ ఇటూ ఒరిగిపోతూ ఉండే అందమైన గోపురం, చక్కటి మచ్చిక గుణం కల్గివుండడం వల్ల వీటికి ముక్కుతాడు వేయడం అరుదుగా జరుగుతుంటుందన్నారు. లాగుడు శక్తి ఇతర జాతి ఎద్దుల కన్నా ఎక్కువగా ఉంటుందన్నారు. సుమారు 2 వేల పౌండ్ల వరకు బరువు అవలీలగా లాగగలవన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో అలుపెరగని విధంగా దుక్కులు దున్నుతాయన్నారు. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా ఒంగోలు జాతి పశువులు తట్టుకుంటాయన్నారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరాన్ని కూడా సునాయాసంగా నడవగల్గుతాయన్నారు. యజమానుల పట్ల విధేయత, విశ్వాసాలను కల్గివుంటాయన్నారు. రైతుకు ఉపయోగపడే ఈ ఒంగోలు జాతి పశువులను పెంచితే ప్రజల్లోకి తీసుకువెళ్ళి వీటిని చూపించాలనే తాపత్రయంతో పశు పోషకులు పలు ప్రాంతాల్లో నిర్వహించే పోటీలకు తమ ఎడ్లను తీసుకువస్తుంటారన్నారు. ఒంగోలు జాతి వైభవాన్ని పెంచడమే లక్ష్యంగా తాను, తన సోదరుడు కొడాలి నాని పనిచేస్తున్నట్టు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్చర్మన్ అడపా బాబ్జి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments