జిల్లా క‌లెక్ట‌ర్ చొర‌వ‌తో నిలిచిన ఓ ప్రాణం



జిల్లా క‌లెక్ట‌ర్ చొర‌వ‌తో నిలిచిన ఓ ప్రాణం


స‌కాలంలో అత్య‌వ‌స‌ర‌ చికిత్స అందించిన జిల్లా ఆసుప‌త్రి వైద్యులు

ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ఓ వ్య‌క్తి

నెల్లిమ‌ర్లలోని వేణుగోపాలపురం వాసి అప్పారావుగా గుర్తింపు

మెరుగైన చికిత్స‌తో కె.జి.హెచ్‌.లో కోలుకుంటున్న అప్పారావు


విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 (ప్రజా అమరావతి):

జిల్లా ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డం ద్వారా ఉత్త‌మ అధికారిగా మ‌న్న‌న‌లు పొంద‌డ‌మే కాదు, మాన‌వ‌త్వంతో సాటి మ‌నిషికి స‌కాలంలో స‌హాయం అందించి ఒక వ్య‌క్తి ప్రాణాన్ని నిల‌బెట్ట‌డం ద్వారా తాను మానవ‌త్వం మూర్తీభ‌వించిన మనిషిన‌ని నిరూపించారు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి. రోడ్డు ప్ర‌మాదానికి గురై రోడ్డు ప్ర‌క్క‌న రక్త‌పు మ‌డుగులో ప‌డి వున్న ఓ వ్య‌క్తిని ఓ అధికారి వాహ‌నంలో జిల్లా ఆసుప‌త్రికి పంపించి, ఆ వ్య‌క్తికి త‌క్ష‌ణ వైద్య స‌హాయం అందించి ఆ వ్య‌క్తి ప్రాణాన్ని కాపాడారు జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి. జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో త‌క్ష‌ణం రంగంలోకి దిగి ఆ వ్య‌క్తికి అన్ని వైద్య ప‌రీక్ష‌లు జ‌రిపి ప్రాథ‌మిక చికిత్స అందించ‌డంతోపాటు మెరుగైన వైద్య స‌హాయంకోసం విశాఖ‌లోని కె.జి.హెచ్‌.కు పంపించారు జిల్లా ఆసుప‌త్రి వైద్యులు. కె.జి.హెచ్‌.లో చేరిన ఆ వ్య‌క్తి కోలుకోని ఈరోజు మ‌ధ్యాహ్నానికి ప్రాణాపాయ స్థితి నుంచి ఆహరం తీసుకొనే ప‌రిస్థితి ఏర్ప‌డ‌టంతో వైద్యులు సంతోషం వ్య‌క్తంచేస్తున్నారు. ఈ ఘ‌ట‌న శ‌నివారం జ‌రుగ‌గా ఈ ఘ‌ట‌న‌పై స్పందించి గోల్డెన్ అవ‌ర్‌లో ఆసుప‌త్రికి పంపించి చికిత్స అందేలా చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి చొర‌వ‌ను వైద్యులు ప్ర‌శంసిస్తున్నారు.


నెల్లిమ‌ర్ల మండ‌లం వేణుగోపాల‌పురంకు చెందిన బి.అప్పారావు (30) అనే వ్య‌క్తి శ‌నివారం త‌న ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తూ నెల్లిమ‌ర్ల నుంచి గాజుల‌రేగ‌, జె.ఎన్‌.టి.యు. జంక్ష‌న్‌కు వెళ్లే మార్గంలో ప్ర‌మాదానికి గుర‌య్యారు. చీపురుప‌ల్లిలో ఫించ‌నుల పంపిణీ కార్య‌క్ర‌మానికి హాజ‌రై తిరిగి విజ‌య‌న‌గ‌రం వ‌స్తున్న జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి రోడ్డు ప‌క్క‌న ఓ వ్య‌క్తి ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి వుండ‌టాన్ని గుర్తించారు. వెంట‌నే త‌న కారు ఆపి 108 వాహ‌నంలో ఆ వ్య‌క్తిని ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు ఫోన్ చేశారు. అయితే ఆ వాహ‌నం వ‌చ్చేందుకు కొంత ఆల‌స్య‌మ‌వుతుంద‌ని గుర్తించి త‌న వెనుకే వ‌స్తున్న విజ‌య‌న‌గ‌రం ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్ అధికారిక వాహ‌నంలో ఆ వ్య‌క్తిని జిల్లా కేంద్ర ఆసుప‌త్రికి మ‌ధ్యాహ్నం 2-15 గంట‌ల ప్రాంతంలో త‌ర‌లించారు. వెంట‌నే జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వ‌య అధికారి డా.నాగ‌భూష‌ణ‌రావుకు ఫోన్ చేసి ఒక వ్య‌క్తిని కారులో ఆసుప‌త్రికి పంపిస్తున్న విష‌యాన్ని తెలియ‌జేసి ఆ వ్య‌క్తికి అత్య‌వ‌స‌ర చికిత్స అందించాల్సిందిగా క‌లెక్ట‌ర్ తెలిపారు.

ఆ స‌మయానికి ఆసుప‌త్రిలోనే వున్న డి.సి.హెచ్‌.ఎస్‌. డా.నాగ‌భూష‌ణ‌రావు ఇత‌ర వైద్యుల‌ను, సిబ్బందిని సిద్దంచేసి ఆసుప‌త్రిలో ఆ వ్య‌క్తిని చేర్పించిన వెంట‌నే సి.టి.స్కాన్‌, బ్రెయిన్ స్కాన్‌, ఛాతీ స్కాన్ వంటి ప‌రీక్ష‌ల‌తో పాటు బి.పి., ప‌ల్స్ వంటి ఆరోగ్య త‌నిఖీల‌న్నీ వైద్యులు నిర్వ‌హించారు. వైద్య ప‌రీక్ష‌ల్లో ఆ వ్య‌క్తి ప‌ల్స్ సాధార‌ణంగానే ఉన్న‌ప్ప‌టికీ అప‌స్మార‌కంగా వుండ‌టంతో మెద‌డుకు సంబంధించిన చికిత్స‌కోసం తక్ష‌ణం కె.జి.హెచ్‌.కు త‌ర‌లించాల‌ని వైద్యుల సూచ‌న మేర‌కు జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వ‌య అధికారి డా.నాగ‌భూష‌ణ‌రావు ఆ వ్య‌క్తిని కె.జి.హెచ్‌.కు త‌ర‌లించే ఏర్పాట్లు చేసి అక్క‌డి వైద్యుల‌తో మాట్లాడారు. శ‌నివారం సాయంత్రానికి ఆ వ్య‌క్తిని విశాఖ‌కు త‌ర‌లించి చికిత్స అందించ‌గా ఆదివారం మ‌ధ్యాహ్నానికి అప్పారావు అనే వ్య‌క్తి అప‌స్మార‌క స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డి ఆహారం తీసుకున్న‌ట్టు డి.సి.హెచ్‌.ఎస్‌. డా.నాగ‌భూష‌ణ‌రావు వివ‌రించారు. ఆ వ్య‌క్తికి ప్ర‌మాదంలో ద‌వ‌డ ఎముక విరిగిన‌ట్లు కె.జి.హెచ్‌. వైద్యులు గుర్తించార‌ని, త్వ‌ర‌లోనే చికిత్స చేస్తార‌ని తెలిపారు. ప్రాణాపాయ స్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని, కేవ‌లం గోల్డెన్ అవ‌ర్‌లో చికిత్స అందించ‌డం వ‌ల్లే ర‌క్త‌స్రావాన్ని నివారించి స‌కాలంలో చికిత్స అందించి ఆ వ్య‌క్తి ప్రాణాన్ని కాపాడ‌గ‌లిగామ‌ని డి.సి.హెచ్‌.ఎస్‌. పేర్కొన్నారు.


స‌మాజంలో బాధ్య‌త‌గ‌ల ఓ వ్య‌క్తిగా తోటి మ‌నిషికి స‌హాయం అందించాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌డంతోపాటు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారిగా త‌న‌కున్న అధికారాల‌ను వినియోగించి  ఒక పౌరుని ప్రాణాన్ని కాపాడ‌టంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి చూపిన చొర‌వ‌ను వైద్య వ‌ర్గాలు, ఇత‌రులు అభినందిస్తున్నారు.



Comments