శ్రీ శైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు

 *శ్రీ శైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు


*

*ఉప ముఖ్యమంత్రి & రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*


అమరావతి, సెప్టెంబరు 29 (ప్రజా అమరావతి):   శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరులోపు ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని  ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.  గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అభివృద్దికై మాస్టర్ ప్లాన్ తయారీ చేసేందుకు మరియు ఇతర అభివృద్ది పనులను చేపట్టేందుకు దేవస్థానం భూముల సరిహద్దులు ఇప్పటి వరకూ సరిగా ఖరారు కాకపోవడం పెద్ద ఆటంకంగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నేటి ఉదయం తమ ఛాంబరులో రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్సు & టెక్నాలజీ, గనులు, భూగర్బ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ & స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంయుక్త నేతృత్వంలో సంబందిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల అంశంపై సమగ్రంగా సమీక్షించుకొని కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్సు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సంయుక్త ఆద్వర్యంలో దేవస్థానం భూముల సర్వే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. బ్రిటీష్ పరిపాలనా కాలం 1879 సంవత్సరం ప్రాంతంలో  7 స్క్వేర్  మైళ్ల భూమి అంటే దాదాపు 4,130 ఎకరాల భూమిని శ్రీశైల దేవస్థానానికి కేటాయించడం జరిగిందన్నారు. అదే విధంగా 1967 ప్రాంతంలో మరో 145 ఎకరాల భూమిని ప్రభుత్వం  శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు. అయితే నాగార్జున సాగర్ – శ్రీ శైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో ఈ దేవస్థానం భూములు ఉండటం చేత ఎటు వంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ భూముల సరిహద్దుల ఖరారు తప్పనిసరైందన్నారు. అక్టోబరు నెలాఖరులోపు  ఈ దేవస్థానం భూముల సరిహద్దుల ఖరారు ప్రక్రియ పూర్తియిన వెంటనే  దేవస్థానం అభివృద్దికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడతామని ఆయన తెలిపారు.  రిజర్వ్ ఫారెస్టు నియమ నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ మరియు మతపరమైన  పర్యాటక ప్రాంతాలను అభివృద్ది పరుస్తామని ఆయన తెలిపారు.  శ్రీశైల దేవస్థానం భూముల సమస్యను ఒక కొలిక్కితెచ్చేందుకు సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంధ్రారెడ్డికి మరియు శ్రీ ధర్మాన ప్రసాదరావుకు ఈ సందర్బంగా ఆయన హృదయపూర్వక ధన్యవాదములు  తెలిపారు .


*ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు….*

                                                                                                                                                                                      బెజవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గత నాలుగు రోజుల నుండి ఎంతో ఘనంగా జరుగుచున్నాయని, ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగేందుకు సహకరిస్తున్న  అందరికీ ఆయన ధన్యవాదములు తెలిపారు. భక్తులకు ఎటు వంటి అసౌకర్యాలు కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని, కేవలం అరగంట సమయంలోనే భక్తులు అమ్మవారిని ఎంతో చక్కగా దర్శించుకోగలుగుతున్నారన్నారు.  సామాన్య భక్తులకు రెండు క్యూలైన్లతో పాటు రూ.500/-, రూ.300/- మరియు రూ.100/- ల టికెట్లు కొనుగోలు దారులకు వేరు వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వి.ఐ.పి.ల విషయంలో ప్రొటోకాల్ ను పటిష్టంగా అమలు పర్చడం జరుగుచున్నదని, వి.ఐ.పి.లు ఎంతో చక్కగా అమ్మవారిని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రతి రోజు  దాదాపు 60 వేల వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని,  భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్నదని అక్టోబరు 2 వ తేదీన  ఒక లక్షా 50 వేల వరకూ భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను కూడా చేసినట్లు ఆయన తెలిపారు. 

 

 రాష్ట్ర  దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.


 

Comments