మే 13, 14 తేదీల్లో వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉచిత హెల్త్ క్యాంపు.


విజయవాడ (ప్రజా అమరావతి);


*మే 13, 14 తేదీల్లో వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉచిత హెల్త్ క్యాంపు


*


*విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ లో 2 రోజుల పాటు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహణ*


*తొలి రోజు వైద్య పరీక్షలు,  రెండో రోజు వైద్యులచే కన్సల్టేషన్*


*ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపు*


*11 ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే వైద్య సేవలు*


*ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో 17 రకాల వైద్య పరీక్షలు*


*వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల  సౌజన్యంతో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపు*


*కొత్తగా అక్రిడేటేషన్ పొందే జర్నలిస్టుల కోసం క్యాంపు లోనే హెల్త్ కార్డులు ఇచ్చేలా డెస్క్ ఏర్పాటు చేసే యోచన*


*క్యాంపుకు హాజరయ్యే జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు లేదా సంస్థ జారీ చేసిన ఐడీ కార్డు తమ వెంట తెచ్చుకోవాలి*


*సమాచార పౌర సంబంధాల శాఖ పొందుపరిచిన లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు క్యాంపుకు హాజరై ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి*


- *రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి*


ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా అహర్నిశలు శ్రమించి విధులు నిర్వహించే జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల సంయుక్త సౌజన్యంతో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజీలో మే 13, 14వ తేదీల్లో రెండు రోజుల పాటు హెల్త్ క్యాంపు నిర్వహించి, ఉచితంగా వైద్య సేవలు అందించనున్నామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రా హాస్పిటల్, కేపిటల్, కామినేని, సెంటిని, పిన్నమనేని, అమెరికన్ ఆంకాలజీ & ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఉషా కార్డిక్ సెంటర్, HCG క్యూరి సిటీ క్యాన్సర్ సెంటర్ & హార్ట్ కేర్ సెంటర్, సన్ రైజ్, అను, స్వర హాస్పిటల్ వంటి 11 ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.


ఇప్పటికే https://forms.gle/UEKdx4fZG7yUGBns7  లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు రేపు ఉదయం 7 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు హెల్త్ క్యాంపులో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చన్నారు. తొలి రోజు వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయనున్నామన్నారు. రెండో రోజు వైద్యులచే కన్సల్టేషన్ ఉంటుందన్నారు.


 రెండు రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం(హెల్త్ క్యాంపు) లో మామోగ్రామ్, హృద్రోగ సంబంధిత టెస్ట్ లు, ఈసీజీ, 2డీఎకో, ట్రేడ్ మిల్ టెస్ట్(టిఎంటీ), ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, సీబీపీ, లివర్ పంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొపైల్ టెస్ట్, థైరాయిడ్, డయాబెటిక్ టెస్ట్ లు, ఎక్స్ రే, కళ్లు, డెంటల్ పరీక్షలు వంటి తదితర 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. చిన్న పిల్లలకు సైతం అవసరమైన వైద్య సదుపాయం అందించనున్నట్లు కమిషనర్ తెలిపారు.  


హెల్త్ క్యాంపులో నిర్ధారిత పరీక్షలు చేసిన పిదప అత్యవసర వైద్య సేవలు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సాయం పొందాల్సి వస్తే ఆరోగ్యశ్రీ అనుబంధిత ఆస్పత్రుల(రిఫరల్ హాస్పిటల్)కు వెళ్లడానికి జర్నలిస్ట్ హెల్త్ కార్డు తప్పనిసరి కావున కొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు హెల్త్ కార్డు పొందడానికి వీలైనంత త్వరగా రూ.1,250 చెల్లిస్తే, దీనికి ప్రభుత్వం తరపున మరో రూ.1,250 చెల్లిస్తామని ఆయన తెలిపారు. అవసరం మేరకు హెల్త్ క్యాంపులో కూడా కొత్తగా హెల్త్ కార్డు పొందే సదుపాయాన్ని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 


క్యాంపుకు హాజరయ్యే జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు లేదా విధులు నిర్వర్తిస్తున్న సంస్థకు సంబంధించిన గుర్తింపు(ఐడీ) కార్డును తీసుకురావాల్సి ఉంటుందన్నారు.


వైద్య ఆరోగ్య శిబిరం గురించి గౌరవ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,  గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి. విడదల రజని,  సమాచార శాఖ కమిషనర్ అయిన తనతో పాటు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో శ్రీ. హరిందర్ ప్రసాద్ లతో పలుమార్లు సమీక్ష నిర్వహించిన పిదప రెండు రోజుల పాటు మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జర్నలిస్టులు అందరూ ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి కోరారు.



Comments