అభివృద్ధికి బ్యాంకులు సహకరించాలి.



*అభివృద్ధికి బ్యాంకులు సహకరించాలి*



పార్వతీపురం, మే 29 (ప్రజా అమరావతి): జిల్లా అభివృద్ధికి బ్యాంకులు సహకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విత్త సేవల సంచాలకులు కార్తికేయ మిశ్రా అన్నారు. జిల్లా పర్యటనకు సోమవారం విచ్చేసిన సంచాలకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తగా ఏర్పడటం, షెడ్యూల్ ప్రాంతంలో ఉండటం బ్యాంకుల సహకారం ఎంతో ఉందన్నారు. స్టాండ్ అప్ ఇండియా (Stand Up India), ముద్రా యోజన (Mudra Yojana), పి.ఎం.స్వనిధి (PM SVANidhi ) తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అందుకు సంబంధిత మార్గదర్శకాలు క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. జిల్లాలో అర్హత కలిగిన లబ్ధిదారులు అనేక మంది ఉంటారని వారికి ప్రయోజనం కలుగ జేయవచ్చని అన్నారు. బ్యాంకులు మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. కె.వి.ఐ.సి, కె.వి.ఐ.బి కార్యకలాపాలు విస్తృతం చేయాలని, సంబంధిత అధికారులతో సమీక్షించి లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ను సూచించారు. పి.ఎం. జీవన్ జ్యోతి బీమా (PM Jeevan Jyothi Bima (PMJJB), పి.ఎం సురక్షా బీమా యోజన (PM Suraksha Bima Yojana (PMSBY), అటల్ పింఛను యోజన (Atal Pension Yojana) క్రింద అనేక మంది ప్రయోజనం పొందగలరని అన్నారు. 


  *కేంద్ర ఆర్థిక మంత్రి రాక*


కేంద్ర ఆర్థిక మంత్రి జూన్ నెలలో పార్వతీపురం పర్యటించే అవకాశం ఉందని కార్తికేయ మిశ్రా అన్నారు. పర్యటన ఖరారు అయితే సమాచారం అందిస్తామని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బ్యాంకులు మంచి ప్రగతిని చూపి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రికి స్వాగతం పలకాలని సూచించారు. 


జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు శాఖల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తించి ప్రతిపాదించామని అన్నారు. 


జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జె. ఎల్.ఎన్. మూర్తి జిల్లాలో బ్యాంకుల ప్రగతిని వివరించారు. జిల్లాలో 103 బ్యాంకు శాఖలు, 89 ఎటిఎం లు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో 3,52,641 పి.ఎం.జె.డి.వై ఖాతాలు, 5,19,425 పి.ఎం.ఎస్.బి.వై ఖాతాలు,2,32,175 పి.ఎం.జె.జె.బి.వై ఖాతాలు,14,086 ముద్రా ఖాతాలు ఉన్నాయని వివరించారు. ముద్రా యోజన క్రింద రూ.104.46 కోట్లను 15,383 మందికి పంపిణి చేయడం జరిగిందని తెలిపారు. పి.ఎం స్వనిధి క్రింద 2,075 దరఖాస్తులు అందగా 1994 దరఖాస్తులకు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.    


ఈ కార్యక్రమంలో ఎస్.బి.ఐ డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఏ.వెంకట్రామయ్య, పంకజ్ కుమార్, ఎస్.ఎల్.బి. సి ఎజీఎం ఇ. రాజ బాబు, నాబార్డు ఏజీఎం టి.నాగార్జున, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments