న్యాయవాదులకు వృత్తిపరమైన స్వతంత్రత ముఖ్యం : సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ



న్యాయవాదులకు వృత్తిపరమైన స్వతంత్రత ముఖ్యం : సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహ 


 జిల్లా స్థాయి కోర్టుల ప్రాధాన్యత పెరగాలి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ


 కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పడాలి : సుప్రీంజడ్జి 


 కక్షిదారుల ప్రయోజనాలు, ఆకాంక్షలు నెరవేర్చేలా కోర్టులు పనిచేయాలి : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్


 బొబ్బిలిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన చేసిన న్యాయమూర్తులు


 రూ.31.20 కోట్లతో ఆధునిక వసతులతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం


విజయనగరం, ఫిబ్రవరి 24 (ప్రజా అమరావతి):

న్యాయవ్యవస్థ స్వతంత్రతతో పాటు న్యాయవాద వృత్తిపరంగా స్వతంత్రత కలిగి వుండటం అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత గురించే మాట్లాడు తున్నామని న్యాయవాదులు స్వతంత్రముగా, పటిష్టంగా, శక్తి వంతంగా వుండటం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. న్యాయవాదులు ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోవడం బార్ ను బలహీనం చేస్తుందన్నారు. బొబ్బిలిలో రూ.31.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కోర్టు భవనాల సముదాయానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య భూమి పూజచేసి శంకుస్థాపన చేశారు 

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ మాట్లాడుతూ జిల్లా కోర్టులపై దృష్టి సారిస్తున్నామనీ రాజ్యాంగ మౌలిక స్వరూపం లో జిల్లా కోర్టులు కూడా భాగమేనని ఇటీవల తాను ఒక తీర్పు సందర్భంగా పేర్కొన్నట్టు చెప్పారు. జిల్లా కోర్టులను బలోపేతం చేయడం ద్వారా, వాటిలో ఆధునిక వసతులు కల్పించడం ద్వారా మాత్రమే కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చే న్యాయవాదులను జిల్లా కోర్టులకు ఆకర్షించ గలమని చెప్పారు. ప్రస్తుతం ఈ వృత్తిలోకి వచ్చే వారంతా హైకోర్టు, సుప్రీంకోర్టు లలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. బొబ్బిలి అంటే పౌరుషం గుర్తుకు వస్తుందని పేర్కొంటూ న్యాయవాదులకు ఆ పౌరుషం కలగాలంటే వృత్తిలో అంకిత భావం ఉండాలన్నారు. ధర్మ సంస్థాపన చేసే యజ్ఞశాల కోర్టు అని పేర్కొన్నారు.


రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పై ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని చెప్పారు. యీ భవనం ద్వారా వసతులు సమకూరిన తర్వాత ఇక్కడి ప్రజలకు కోర్టుల ద్వారా మెరుగైన సేవలు అందించాలని కోరారు. న్యాయానికి ఆలయం వంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంతటి సుదూర ప్రాంతాలకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి వంటి స్ధాయిలో వారు రావడం గొప్ప విషయ మన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ యీ ప్రాంత కోర్టుల్లో భూతగాదాలకు సంబంధించిన కేసులే అధికంగా వచ్చేవని పేర్కొన్నారు. జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్, జాయింట్ కలెక్టర్ కే.కార్తీక్, అసిస్టెంట్ కలెక్టర్ బి. సహాదిత్ వెంకట్ త్రివినాగ్, ఎస్.పి.దీపిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాలకృష్ణశర్మ, న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.



Comments