విదేశీ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడానికి కేంద్రం చర్యలు.
* సెమికండక్టర్, డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రూ.76 వేల కోట్లు వ్యయంతో సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్.
* ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి
దిల్లీ/ ఏలూరు మార్చి 19 (ప్రజా అమరావతి): భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, టెలికాం, పవర్ వంటి వేగంగా విస్తరిస్తున్న రంగాల డిమాండ్ను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడడం జరుగుతోందని, దేశీయ సరఫరాను పెంచి దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంతో పాటు 14 కీలక రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాల ద్వారా ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వైట్ గూడ్స్, టెలికాం నెట్వర్కింగ్ ఉత్పత్తులు వంటివి ఉన్నాయని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు.
చైనాలో తయారైన ఉత్పత్తుల దిగుమతిని తగ్గించేందుకు ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
సెమికండక్టర్, డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రూ. 76 వేల కోట్లు వ్యయంతో సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ ఆమోదించబడిందని, ప్రభుత్వం వివిధ రంగాలలో దిగుమతుల పెరుగుదలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని, అదనంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రీమిడీస్ అక్రమ వాణిజ్య పద్ధతులపై చర్యలకు సిఫార్సు చేసే అధికారం కలిగి ఉందని కేంద్ర మంత్రి బదులిచ్చారు.
*మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.559.10 కోట్లు మంజూరు.*
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు కల్పించిన ప్రయోజనాలపై లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర
మత్స్య, పశుసంవర్ధక మరియు పాల పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ బుధవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 39 కార్యకలాపాలకు రూ.2398.72 కోట్ల అంచనా వ్యయంలో రూ.559.10 కోట్లు కేంద్ర భాగస్వామ్యంతో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మంజూరు చేయగా, 2020-21 నుండి 2024-25 మధ్య కాలంలో విడుదల చేసిన రూ.482.55 కోట్లలో రూ.328.13 కోట్లు వినియోగించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ద్వారా గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లో 3,09,771 మంది లబ్దిపొందారని కేంద్ర మంత్రి బదులిచ్చారు.
*ఏపీలో 99.58 శాతం ప్రజలకు మొబైల్ సేవలు*
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన, అప్గ్రేడ్ చేసిన, నిర్మాణంలో ఉన్న మొబైల్ టవర్ల వివరాలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
గత ఐదేళ్లలో ఏపీలో 28803 టవర్లు ఏర్పాటు చేయగా, ఏలూరు పార్లమెంట్ పరిధిలో 1128 టవర్లు అందుబాటులో ఉన్నాయని, మొబైల్ సెల్ టవర్ల నిర్మాణానికి రూ.642 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఏపీలో 99.58 శాతం మంది ప్రజలు మొబైల్ సేవలు వినియోగించుకుంటున్నట్లు కేంద్రమంత్రి బదులిచ్చారు.
addComments
Post a Comment