కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి.
* కేంద్ర ప్రభుత్వానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి.
* కొల్లేరు ప్రజల పక్షాన లోక్ సభలో గళం విప్పిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
దిల్లీ /ఏలూరు, మార్చి 27 (ప్రజా అమరావతి): కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ద్వారా అక్కడ నివసిస్తున్న ప్రజలకు భరోసా కల్పించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కొల్లేరు ప్రజల పక్షాన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం లోక్ సభలో గళం విప్పారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొల్లేరు ప్రాంతంలో సుమారు మూడు లక్షల మందికి పైగా ప్రజలు దీర్ఘకాలికంగా జీవనం సాగిస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. కొల్లేరు సరస్సు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉందని, ఇక్కడికి దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపుతారని ఎంపీ మహేష్ కుమార్ ప్రస్తావించారు. కొల్లేరు ప్రాంతానికి హద్దులు నిర్ణయించాలని, ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో నిర్దేశించిన పరిమితులు ఈ ప్రాంత రైతులు, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిందని, సన్న, చిన్నకారు రైతులు సుమారు 21 వేల ఎకరాల భూములు కోల్పోతున్నారని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొల్లేరు ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని ఎంపీ మహేష్ కుమార్ ప్రస్తావించారు. కొల్లేరు సమస్య తరచూ సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నా, ఇక్కడి ప్రజలు, రైతుల వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎంపీ మహేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ పునరావృతం అవుతున్న కొల్లేరు సమస్య వల్ల ఇక్కడి ప్రజలు మనుగడ సాగించడం ప్రశ్నార్ధకంగా మారిందని, ఇదే కొనసాగితే వలసలు వెళ్లే పరిస్థితి తలెత్తుతుందని ఎంపీ మహేష్ కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర అటవీ శాఖ మంత్రి జోక్యం చేసుకొని కొల్లేరు ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభ్యర్థించారు.
addComments
Post a Comment