ఆంధ్రప్రదేశ్ (తిరుపతి), ఛత్తీస్ గఢ్ (భిలాయ్), జమ్మూ కాశ్మీర్ (జమ్మూ), కర్ణాటక (ధార్వాడ్), కేరళ (పలక్కడ్) లోని అయిదు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం
ఈ ప్రముఖ విద్యాసంస్థల్లో 6500 మందికిపైగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా విస్తరణ
పరిశ్రమ-విద్యా సంబంధాల బలోపేతానికి కొత్తగా అయిదు అత్యాధునిక రీసెర్చ్ పార్కులు
ఆంధ్రప్రదేశ్ (ఐఐటి తిరుపతి), కేరళ (ఐఐటి పలక్కడ్), ఛత్తీస్గఢ్ (ఐఐటి భిలాయి), జమ్మూ కాశ్మీర్ (ఐఐటి జమ్మూ), కర్ణాటక (ఐఐటి ధార్వాడ్) లలో ఏర్పాటైన అయిదు కొత్త ఐఐటీలలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు (ఫేజ్-బి నిర్మాణం) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇందుకోసం 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేళ్ల కాలానికి రూ.11,828.79 కోట్లు ఖర్చు చేస్తారు.
ఈ ఐఐటీలలో 130 ఫ్యాకల్టీ పోస్టుల (ప్రొఫెసర్ స్థాయిలో అంటే లెవల్ 14, అంతకంటే ఎక్కువ) ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పరిశ్రమలు-విద్యా సంబంధాల బలోపేతానికి కొత్తగా అయిదు అత్యాధునిక రీసెర్చ్ పార్కులను కూడా ఏర్పాటు చేస్తారు.
అమలు వ్యూహం - లక్ష్యాలు:
ఇందులో భాగంగా, వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్ డీ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య 6500కిపైగా పెరిగే అవకాశం ఉంది. మొదటి సంవత్సరంలో 1364 మంది, రెండో సంవత్సరంలో 1738 మంది, మూడో సంవత్సరంలో 1767 మంది, నాలుగో సంవత్సరంలో 1707 మంది విద్యార్థుల చొప్పున సంఖ్య పెరుగనుంది.
లబ్ధిదారులు
నిర్మాణం పూర్తయిన తర్వాత, ప్రస్తుత విద్యార్థుల సంఖ్య 7,111 ఉన్న ఈ అయిదు ఐఐటీల్లో మొత్తం 13,687 మంది విద్యార్థులకు విద్యను అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అంటే విద్యార్థుల సంఖ్య మరో 6,576 పెరుగుతుంది. ఈ సీట్ల పెంపుతో, దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ విద్యాసంస్థల్లో చదవాలన్న 6,500కిపైగా విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరతాయి. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సృష్టించడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఇది దేశ నిర్మాణానికి దోహదపడుతుంది. సామాజికంగా కూడా ఇది మొబిలిటీని మెరుగుపరచి విద్యా అసమానతలను తగ్గిస్తుంది. అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
ఉపాధి కల్పన
పెరిగిన విద్యార్థుల సంఖ్య, సౌకర్యాల నిర్వహణకు అనుగుణంగా అధ్యాపకులు, పరిపాలనా సిబ్బంది, పరిశోధకులు, సహాయక సిబ్బంది నియామకాలతో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే, ఐఐటి క్యాంపస్ ల విస్తరణ, గృహ నిర్మాణం, రవాణా, ఇతర సేవలకు డిమాండును సృష్టించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుంది. ఐఐటీల నుంచి గ్రాడ్యుయేట్లు, పోస్ట్గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగడం వల్ల ఆవిష్కరణలు, స్టార్టప్ వ్యవస్థలు మరింత శక్తిమంతమవుతాయి. ఇది వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రాష్ట్రాలు - జిల్లాలు
ఈ అయిదు ఐఐటీలు... ఆంధ్రప్రదేశ్ (ఐఐటి తిరుపతి), కేరళ (ఐఐటి పలక్కడ్), చత్తీస్ ఘఢ్ (ఐఐటి భిలాయ్), జమ్మూ కాశ్మీర్ (ఐఐటి జమ్మూ), కర్ణాటక (ఐఐటి ధార్వాడ్) రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. కాగా, ఐఐటీల్లో ప్రవేశాలు దేశవ్యాప్తంగా (పాన్-ఇండియా) ఆధారంగా జరిగే కారణంగా, ఈ విస్తరణ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
2025-26 బడ్జెట్
గత పదేళ్లలో 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.35 లక్షలకు వంద శాతం పెరిగింది. 2014 తర్వాత ప్రారంభమైన అయిదు ఐఐటీల్లో అదనపు మౌలిక వసతులు కల్పించి మరో 6,500 మంది విద్యార్థులకు విద్యను అందించనున్నారు.
నేపథ్యం
ఆంధ్రప్రదేశ్ (ఐఐటి తిరుపతి), కేరళ (ఐఐటి పలక్కడ్), ఛత్తీస్ ఘడ్ (ఐఐటి భిలాయ్), జమ్మూ కాశ్మీర్ (ఐఐటి జమ్మూ), కర్ణాటక (ఐఐటి ధార్వాడ్) రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ అయిదు కొత్త ఐఐటిలు ఏర్పాటయ్యాయి. 2015-16లో పలక్కాడ్, తిరుపతిలోని 2015-16లో పాలక్కాడ్, తిరుపతిలోని ఐఐటీల అకడమిక్ సెషన్ ప్రారంభం కాగా, మిగిలిన మూడు ఐఐటీలు 2016-17లో తాత్కాలిక క్యాంపస్ నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ఐఐటీలు ఇప్పుడు వాటి శాశ్వత క్యాంపస్ ల నుంచి పనిచేస్తున్నాయి.
addComments
Post a Comment